Bus Accident: మహబూబ్నగర్ జిల్లాలోని మాచారం సమీపంలో NH 44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం ధాటికి ట్యాంకర్ లీకై అందులో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుండి దట్టమైన పొగలు వెలువడటంతో హైవేపై కొంత పైపు భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.