Parliament Disruptions: నిమిషానికి 2.5 లక్షలు, గంటకు కోటిన్నర రూపాయలు. ఇదీ పార్లమెంట్ సమావేశాల నిర్వహణ ఖర్చు లెక్కలు. అంటే సభలో ప్రతి నిమిషం విలువైనదే, ప్రతి గంట కీలకమైనదే. కానీ ఆ సభా సమయం నిరసనలు, నినాదాలు, వాయిదాలతో వృధాగా కరిగిపోతోంది. పేదవాడు కడుపు కట్టుకుని కట్టే పన్నుల డబ్బు అది. అలాంటి పవిత్రమైన ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చుతున్నారు. 18రోజులుగా సాగుతున్న సెషన్స్లో చర్చలు సున్నా… హంగామా మాత్రమే సరిహద్దులు దాటింది. ద్రవ్యోల్బణంతో నలిగిపోతున్న సామాన్యుడి గోడు ఆ సభలో వినిపించలేదు. నిరుద్యోగుల కన్నీళ్లు, రైతుల బాధలు ఆ సభలో కనిపించలేదు. ప్రజల సమస్యలపై ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా చర్చ జరగలేదు. కానీ అదే కోలాహలం మధ్య తమకు కావాల్సిన బిల్లులను మాత్రం గట్టుకెక్కించుకున్నారు. రేపటితో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. దేశ భవిష్యత్తును మార్చాల్సిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు లాంటి అత్యంత కీలకమైన అంశాలు మళ్లీ అటకెక్కినట్లే కనిపిస్తోంది. పార్లమెంట్.. కేవలం రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే అడ్డాగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. . కోట్లు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపింది ప్రజాసమస్యలపై పోరాడడానికా? లేదంటే ఇలా ఒకరినొకరు తిట్టుకుంటూ దేశ భవిష్యత్తును ఆరిపేయడానికా?