YS Jagan Kurnool Public Meeting: రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కలిసి ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎం జగన్ అన్నారు. వైసీపీని ఓడించేందుకు వారు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు బహిరంగ సభలో సీఎం జగన్ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై విరుచుకుపడ్డారు. మే 13వ తేదీన కురుక్షేత్రం జరగబోతోందని అన్నారు. ఈ కురుక్షేత్రంలో తనని ఓడించడానికి పెత్తందార్లందరూ ఏకమయ్యారని.. అయితే వారిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. తనని ఎలా ఓడించాలని వారు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
తాము అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో విద్యారంగంలో కనివినీ ఎరుగని విధంగా మార్పులు తీసుకువచ్చామన్నారు. పిల్లల చేతికి ట్యాబ్ లు అందించామన్నారు. పిల్లలు బడిబాట పట్టేలా మరే ఇతర పనులకు వెళ్లకుండా ఉండేందుకు.. అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ఇంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం తీసుకువచ్చామని తెలిపారు.
జెండాలను జతకట్టే వారిని ఓడించేందుకు సిద్ధమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. విద్యారంగాన్ని విమర్శించిన టీడీపీ ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. పేదలంతా ఓ వైపు.. పెత్తందార్లు అంతా మరో వైపు ఉన్నారని అన్నారు. మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా తీసుకురాలేదని.. అలాంటి కూటమి ప్రస్తుతం కుట్రలు చేస్తోందని విమర్శలు చేశారు. పేదలు సొంతింటి కళను నెరవేర్చామని తెలిపారు. మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకువచ్చామన్నారు. అలాంటి ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని కోరారు.
Also Read: Raghurama krishna raju: ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో.. ఎంపీ రఘురామ కృష్ణరాజు?
మే 13న జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో మంచి చేసే తాను ఓ వైపు ఉంటే.. పెత్తందార్లు మరో వైపు ఉన్నారని అన్నారు. మంచి చేయడం కోసం ప్రజలు వైసీపీకి ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో ప్రజలు వైసీపీని గెలిపించాలన్నారు. మొత్తం 200 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.