YS Sharmila Contesting from Kadapa Parliament : కడప పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబడుతారన్న సందిగ్థత వీడింది. వైఎస్ షర్మిలను కడప పార్లమెంట్ అభ్యర్థిగా నియమిస్తూ ఏపీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, విశాఖపట్నం నుంచి సత్య రెడ్డి ఉండనున్నారు.
కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లం రాజు నిలవనున్నారు. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను పెండింగ్లో పెట్టారు. 117 అసెంబ్లీ స్థానాల్లోనూ కొందరి పేర్లను అధిష్టానం సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్ లో ఉంచినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఉదయం సీఈసీ భేటీకి హాజరైన షర్మిల.. 114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఏపీలో పెన్షన్ల జాప్యంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. పెన్షన్ల విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం జరుగుతుందని, ఇందుకు ప్రతిపక్షాలే కారణమని విరుచుకుపడ్డారు. ఒక్కరోజులో పూర్తయ్యే పనికి 10 రోజుల సమయం ఎందుకు పడుతుందని ప్రశ్నించారామె. పెన్షన్ల విషయంలో చీఫ్ సెక్రటరీ వెంటనే చొరవ తీసుకుని డీబీటీ ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.