ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఆధునికతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో.. ఇకపై ప్రవేశపెట్టే కొత్త బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చేరువయ్యే పల్లెవెలుగు సర్వీసుల్లో కూడా ఏసీ సౌకర్యం తప్పనిసరి చేయాలని ఆయన సూచించడం విశేషం.
సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆర్టీసీ రోడ్ మ్యాప్ను పరిశీలించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులను (EVs) కొనుగోలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పల్లెవెలుగు బస్సులంటే కేవలం సాధారణ ప్రయాణ సాధనాలుగా కాకుండా, సామాన్యులకు కూడా చల్లని ప్రయాణ అనుభూతిని అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో రవాణా నాణ్యత పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు, త్వరలో రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం దృష్టి సారించారు. గోదావరి జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని చెప్పారు. ఈ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు దోహదపడతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. డీజిల్ ఖర్చులను తగ్గించుకుని, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడం ద్వారా అటు పర్యావరణానికి, ఇటు సంస్థ ఆర్థిక పరిస్థితికి మేలు జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు
ALSO READ: Rajam constituency: టీడీపీలో పొలిటికల్ ఫైట్.. రాజాంకి గ్రీష్మే దిక్కా?