Trending Talent: ట్రెండ్ సెట్ చేయాలంటే, తెలుగువారి తర్వాతే ఎవరైనా. ఏ పనిలోనైనా కాస్త శ్రద్ధ ఉంచారే అనుకోండి, అందులో సక్సెస్ తెలుగువారి సొంతం. ఇలా చెప్పేందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఒక సామాన్య టైలర్ ఆలోచన తీరును ఏకంగా సీఎం మెచ్చుకొనే స్థాయి వచ్చిందంటే, ఆ వ్యక్తి ఎంత భిన్నంగా ఆలోచించి ఉండాలో ఒక్కసారి ఊహిస్తే సరిపోతుంది. ఏపీకి చెందిన ఓ టైలర్ ఒక ట్రెండ్ నే సృష్టించాడు. ఆ టైలర్ ఎవరు? ఆయన సాధించిన ఘనత ఏమిటో తెలుసుకుందాం.
నేటి కాలంలో చిన్న చిన్న వ్యాపారాలు దిగజారిపోతున్నాయి, రెడీమేడ్ దుస్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. టైలర్లు తమ పనులకు తలవంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కానీ ఆ పరిస్థితిని ఎదుర్కోకుండా, దాన్ని ఓ అవకాశంగా మార్చుకుంటూ ఒక సాధారణ గ్రామీణ టైలర్ చేసిన ప్రయోగం ఇప్పుడు అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.
కృష్ణా జిల్లా వణుకూరు గ్రామానికి చెందిన షేక్ కాలేషా ఒక సాధారణ టైలర్. తాను బట్టలు కుట్టే చిన్న షాపులో రోజువారీ కష్టాలతో జీవనం సాగించేవారు. గత కొన్ని సంవత్సరాలుగా రెడీమేడ్ మార్కెట్ పెరిగిపోవడం, నగరాల్లో పెద్ద పెద్ద బుటిక్లు తెరుచుకోవడం వల్ల కాలేషా వ్యాపారం మందగించింది. కస్టమర్లు తగ్గిపోవడంతో ఆదాయం తగ్గిపోయింది. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది.
అయితే కాలేషా ఆగలేదు. బదులుగా తన పరిస్థితిని మార్చడానికి కొత్త మార్గం వెతికాడు. కస్టమర్స్ మన వద్దకు రావడం కాదు, మనం వాళ్ల దగ్గరకు వెళ్తే ఎలా ఉంటుందో? అనే ఆలోచనతో మొబైల్ టైలరింగ్ సేవలను ప్రారంభించారు. మొదట్లో ఒక పాత రిక్షాలో తన కుట్టు మిషన్ పెట్టి, వేరే గ్రామాలకు వెళ్లి కస్టమర్ల ఇంటి వద్దే మేజర్ తీసుకుని దుస్తులు కుట్టడం మొదలుపెట్టారు.
ఈ సరికొత్త ఆలోచన ఊహించని విజయాన్ని తెచ్చిపెట్టింది. గ్రామాల్లో ముఖ్యంగా పెద్దవాళ్లు, మహిళలు, పనిలో బిజీగా ఉండే ప్రజలు ఇంటికే వస్తున్న టైలర్ను సాదరంగా ఆహ్వానించారు. పాత రోజుల్లో బజారుకి వెళ్లి దుస్తుల్ని కుట్టించుకునే కష్టాలు లేకుండా ఇంట్లోనే మేజర్ తీసుకుని, తిరిగి కుట్టిన బట్టలు కూడా డెలివరీ చేయడం వల్ల ఆయన సేవలకు డిమాండ్ పెరిగింది.
ఈ విజయం చూసిన తరువాత కాలేషా తన సేవలను మరింత విస్తరించడానికి టీవీఎస్ కొనుగోలు చేసి దానిపై మిషన్, ఇతర సాధనాలతో కూడిన మొబైల్ వర్క్స్టేషన్ను తయారు చేసుకున్నాడు. దీనికై రూ. 40 వేలు ఖర్చు చేశారు. ఇప్పుడు రోజుకు ఒక్కో గ్రామం చొప్పున తిరుగుతూ, స్థానికంగా కస్టమర్ల వద్దే టైలరింగ్ సేవలు అందిస్తున్నారు. ఆయన ఫోన్ నంబర్ స్థానికంగా అందరికీ సుపరిచితమే. కాల్ చేస్తే ఇంటికే వస్తారు. అవసరమైన మార్పులు చెబుతారు. బట్టలు సిద్ధమైతే తిరిగి డెలివరీ చేస్తారు.
ఇది కేవలం ఒక టైలర్ కథ కాదు. ఇది నూతన ఆలోచనకు నిదర్శనం. ఇప్పటి కాలంలో యువత ఉద్యోగాలు రావడంలేదని బాధపడుతున్నారు. కానీ కాలేషా లాంటి వ్యక్తులు చిన్న వ్యాపారాన్నే కొత్త కోణంలో ఆలోచించి, విజయం సాధిస్తున్నారు. నూతనతకు విలువ ఉన్న ఈ యుగంలో ఇలా వినూత్నమైన విధానం ద్వారా ఆయన మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. రోజుకు రూ. 500 కు పైగా ఆదాయం పొందుతున్నారు ఈయన.
తన సేవల గురించి ప్రచారం అయ్యాక, కాలేషాకు ఇతర ప్రాంతాల నుండి కూడా ఆహ్వానాలు వచ్చాయి. కొన్ని నగరాల్లో అతని విధానాన్ని ఫ్రాంచైజీగా చేయాలని కూడా కొంతమంది వ్యాపారులు యోచిస్తున్నారు. ఇది చూస్తే, ఓ చిన్న గ్రామంలో నుంచి పెద్ద మార్పు ఎలా మొదలవుతుందో అర్థమవుతుంది.
Also Read: Annadata Sukhibhava Scheme: ఖాతాల్లో రూ. 20 వేలు.. వీరందరూ అనర్హులే!
అంతేకాదు, కాలేషా తన వృత్తికి మరింత గౌరవం తీసుకువచ్చారు. ఒక సాధారణ టైలర్ అని చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని, సృజనాత్మకంగా ఆలోచిస్తే ఏ పనైనా గొప్పదే అవుతుందని నిరూపించారు. పాడిపంటల మధ్యలో ఊర్లోకి వస్తున్న ఇతని బైక్ మోటార్ మీద కుట్టు మిషన్, రెండు చిన్న బాక్స్లు, ఇప్పుడు స్థానికంగా చిన్న పిల్లల నుండి పెద్దల దాకా అందరికీ గుర్తుండిపోయేలా మారింది. ఉద్యోగం కోసం నగరాల చుట్టూ తిరిగే బదులు, మన వద్ద ఉన్న నైపుణ్యాన్ని వినూత్నంగా వినియోగించుకుంటే సక్సెస్ మన ముందే ఉందని చెప్పే గొప్ప ఉదాహరణ ఇది. అందుకే కాలేషా ఐడియాను సీఎం చంద్రబాబు సైతం మెచ్చుకొని, ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంతైనా ట్రెండ్ సెట్ చేసిన కాలేషా గ్రేట్ కదా!