
Bunny Utsavam 2023 : కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం ముగిసింది. ప్రతి ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవంగా కర్రల యుద్ధాన్ని చేపట్టడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. అర్ధరాత్రి వేళ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో అక్కడి స్థానిక ప్రజలు బన్నీ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాంప్రదాయం, ఆచారం పేరిట ఈ భక్తి పోరాటం కొనసాగుతుంది.
ఈ ఏడాది ఉత్సవంలో 60 మందికి పైగా గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతీసారి బన్నీ ఉత్సవం.. ఓ వైపు కోలాహలంగా, మరోవైపు నెత్తురుమయంగా వేడుక జరుగుతుంది. పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంతో ఈసారి వేడుక ప్రశాంతంగానే జరిగింది.
బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవం యుద్ధానికి సిద్ధమయ్యారు. విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు కొందరు దానిని అడ్డుకునేందుకు కొందరు కర్రలతో కొట్టుకుంటారు.
ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలై, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో ఉన్నాయి. అయినా ఈ ఉత్సవం ఇలా జరగడమే బాగుందంటుందని అక్కడి స్థానికులు అంటున్నారు. తన ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తామని.. మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదని స్థానిక భక్తులు చెబుతున్నారు.
ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్న బన్నీ ఉత్సవాలలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసు అధికారులు తీవ్రంగా కసరత్తు చేశారు. దేవరగట్టులో రక్తపాతం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈసారి బందోబస్తు పటిష్ట బందోబస్తు చేశామన్నారు. అలాగే.. భక్తులు నాటుసారా సేవించకుండా కట్టడి చేశారు. ఇనుప చువ్వల కట్టెలు వాడకుండా చర్యలు తీసుకుంటూ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రశాంతమైన వేడుక జరిగేలా ఉత్సవ కమిటీతో మాట్లాడారు. ఈ ఉత్సవంలో వేల సంఖ్యల్లో భక్తులు పాల్గొన్నారు.