CM Chandrababu: మెగా డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయంటూ విపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు ఖండించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకూ ఇప్పటివరకూ 14 డీఎస్సీలు జరిగితే.. అందులో 11 నియామకాలు టీడీపీ హయాంలోనే జరిగినట్లు తెలిపారు. ఇంతవరకూ అవినీతి జరిగిందని ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. కాబట్టి వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని.. సభా వేదికగా రాష్ట్ర ప్రజలకు స్పష్టతనిచ్చారు.
మరోవైపు విద్యావ్యవస్థ అభివృద్ధికి టీడీపీ చేసిన కృషిని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రస్తావించారు. విద్యారంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించిందని గుర్తుచేశారు. రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా నాడు ఎన్టీఆర్ సంస్కరణలు తెచ్చారని పేర్కొన్నారు. మహిళలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటినీ ఏర్పాటు చేసింది ఎన్టీఆరే అని గుర్తుచేశారు. తాను సీఎం అయిన తొలినాళ్లలోనూ పాఠశాలలు లేకపోవటంపై తక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ప్రతీ కిలోమీటరుకు ఓ ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కి.మీ ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతీ మండలానికి ఓ జూనియర్ కాలేజి, ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామని అసెంబ్లీ ప్రసంగంలో చంద్రబాబు అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా 2019-24 మధ్య సంస్కరణలు తెచ్చినట్లు గత పాలకులు డబ్బాలు కొట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు.
పాఠశాలలకు విద్యార్ధుల హాజరును పెంచేందుకు డ్రై రేషన్ కూడా అందించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో నాడు టీడీపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందన్న ఆయన.. ఇంటర్ విద్య వరకూ ఈ పథకాన్ని విస్తరించామని తెలియజేశారు. మహిళలకు విద్యలో కూడా 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
Also Read: వందేమాతరం వివాదం.. సోనియా, రాహుల్పై పోలీసు కంప్లైంట్.. అసలేం జరిగిందంటే?
అంతకుముందు అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లోనూ వైసీపీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గ్రూప్ – 1 లాంటి స్కామ్ ను తన 50 ఏళ్ల జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఎల్లుండి అన్ని వాస్తవాలు అసెంబ్లీలో బయటపెడతామన్నారు. వైసీపీ స్వార్థానికి ఎందరో నిరుద్యోగులు బలయ్యారన్న చంద్రబాబు.. ఇప్పుడు డీఎస్సీని సైతం దెబ్బతీసేందుకు వైసీపీ కంకణం కట్టుకుందని ఆరోపించారు. వైసీపీ నేతల విమర్శలతో తమ అత్మాభిమానం దెబ్బతింటుండటంతో పెద్ద ఎత్తున డీఎస్సీ అభ్యర్థులు రోడ్డు మీదకు వచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: మైండ్ బ్లాక్ అయ్యే ఫీచర్లు,తక్కువ ధర.. ఊరమాస్ డిస్ప్లేతో స్మార్ట్వాచ్!