రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీన్ రిపీట్ అవుతూ వస్తోంది. అది చాలా కామన్గా మారిపోయింది. మాజీ సీఎంలు ఇద్దరూ అసెంబ్లీకి ముఖం చాటేశారు. అసలు అటువైపుకి రావడం లేదు. ఎక్కడైనా ప్రతిపక్షం.. అధికార పక్షాన్ని ఇరుకున పెడుతుంది. కానీ ఇక్కడ అధికార పక్షమే ప్రతిపక్షాన్ని ఇరుకున పెడుతోంది.
ఈ విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమయ్యాయి. జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టే అంశాన్ని ప్రధాన ఇష్యూగా మాట్లాడారు. కచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందేనని, వైసీపీ ఆరోపిస్తున్న ప్రతీ అంశంపై కూలంకషంగా చర్చించేందుకు , సమాధానం చెప్పేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించిన లోకేశ్.. బెంగుళూరులో ఉన్న జగన్ ప్రత్యేక విమానం ద్వారా వెంటనే తరలివచ్చి అసెంబ్లీ సెషన్స్కు హాజరు కావాలని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
తెలంగాణలో కూడా సీఎం రేవంత్ పదే పదే కేసీఆర్ .. అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షం వైఫల్యంగా ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తారు సీఎం. సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నామని, రండి తేల్చుకుందామంటూ బీఆరెస్కు సవాల్ విసిరారు రేవంత్. అయితే కేటీఆర్ దీనికి ప్రతీసారి స్పందిస్తూనే ఉన్నారు.
రేవంత్కు సమాధానమిచ్చేందుకు, చర్చించేందుకు తాము చాలునని, కేసీఆర్ అవసరం లేదంటూ కాంగ్రెస్ వ్యహానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. కానీ దీన్ని వదిలేలా లేరు రేవంత్. రేవంత్ తోపాటు పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, కీలక నేతలంతా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదనే విషయాన్ని పదే పదే ప్రస్తావించడం మూలంగా ఆయన ఓడినందుకు ప్రజల పై అలక వహించి ఫామ్హౌజ్కే పరిమితం అవుతున్నారనే అంశాన్ని ప్రజల్లో చర్చకు పెట్టే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
సేమ్, ఏపీలో కూడా జగన్ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. కాకపోతే, ఆయన పార్టీలైన్లో చేసే ఆందోళనలకు మాత్రం ముందు వరుసలో ఉంటున్నారు. ప్రతీ అంశంపై స్పందిస్తున్నారు. నేరుగా తనే సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్లి.. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కొన్ని ఆ పార్టీకి మైలేజీని తెచ్చిపెడుతున్నా.. కొన్ని ఆందోళనలు ప్రజల మద్దతు కూడగట్టడంతో విఫలమవుతున్నాయి.
కానీ జగన్ అసెంబ్లీకి రాకపోవడాన్ని టీడీపీ ఓ అస్త్రంగా ప్రయోగిస్తున్నది. అసెంబ్లీ వేదికగా లోకేశ్ లేవనెత్తున్న అంశాలు.. చర్చకు రావాలని విసుతున్న సవాళ్లకు వైసీపీ నుంచి స్పందన కరువవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షం ఈ అంశంలో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.