CM Chandrababu: రైతులు మామిడిని రోడ్లపైనే పారబోస్తున్నారు-పెద్దిరెడ్డిఏపీలో చిత్తూరు జిల్లా మామిడి రాజకీయం అధికార, ప్రతిపకాల మద్య కాకరేపుతోంది. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కిలో మామిడి 8 రూపాయలకు కొనాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీనికి అదనంగా ప్రభుత్వం తరుపు నుంచి మరో 4 రూపాయలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారాయన. అయితే మరోవైపు రేపు బంగారుపాళ్యం మామిడి రైతులను కలవనన్నారు వైసీపీ అధినేత YS జగన్.
గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మ్యాంగో రైతులకు ఉపశమనం
చిత్తూరు జిల్లా మామిడి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మ్యాంగో రైతులకు సీఎం ఉపశమనం కలిగించారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా మామిడి రైతులతో సమావేశం నిర్వహించారు. పల్ప్ పరిశ్రమ యజమానులతో మాట్లాడారు. మామిడి రైతులకు కిలోకు 8 రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రోత్సాహకం కింద అదనంగా మరో 4 రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. మామాడి రైతులు, పల్ప్ యజమానులు కలిసి పని చేయాలని సీఎం సూచించారు.
మామాడి రైతులు, పల్ప్ యజమానులు కలిసి పని చేయాలని సీఎం సూచన
రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు. పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ప్రతిపక్షాలు రైతులను అడ్డుగా పెట్టుకొని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు వారి మాయలో పడొద్దన్నారు చంద్రబాబు. మామిడి రైతులకు భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యా లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.
బంగారుపాళ్యం మామిడి మార్కెట్ను సందర్శించనున్న జగన్
మరోవైపు రేపు చిత్తూరు మామిడి రైతులతో సమావేశం కానున్నారు వైసీపీ అధినేత జగన్. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగన్ బంగారుపాళ్యెం మామిడి మార్కెట్ను సందర్శిస్తారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్లలో సాగు చేసిన మామిడి పంటను కొనేవారు లేకపోవడంతో రైతులు రోడ్లపైనే పారబోస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి.
Also Read: రామచంద్రరావుకు సవాల్గా మారిన జీహెచ్ఎంసీ, స్థానిక ఎన్నికలు
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే మామిడి రైతులు నష్టాలతో కుదేలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. మామిడి రైతుల కష్టాలను తెలుసుకుని, ప్రభుత్వ మెడలు వంచేందుకు జగన్ వస్తున్నారని తెలిపారు. అయితే.. ఇప్పటికే చంద్రబాబు మామిడి రైతులతో సమావేశమై రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో.. రేపు జగన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.