EAPCET Counseling: నాలుగేళ్లల్లో ఏ ఒక్క ఏడాది మిగతా రాష్ట్రాల్లో చదివితే వారు స్థానికేతరులే అవుతారని అంటోంది ఏపీ ప్రభుత్వం. కొద్దిరోజుల కిందట స్థానికేతర కోటాను ఏపీ విద్యార్థులకు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్కు హాజరైన కొందరు విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఇటు ఏపీ.. అటు తెలంగాణకు చెందినకుండా పోయామనే ఆందోళన చెందుతున్నారు.
ఏపీ-తెలంగాణ విభజన జరిగిన పదేళ్లు అయ్యింది. ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొద్దిరోజుల కిందట స్థానికేతర కోటాను ఏపీ విద్యార్థులకు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార్. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం EAPCET కౌన్సిలింగ్ ఇంజినీరింగ్-మెడికల్ సీట్ల భర్తీ జరగనుంది.
ఏపీలో పదో తరగతి వరకు చదివినవారు, తెలంగాణలో ఇంటర్ చదివిన విద్యార్థులను కౌన్సిలింగ్లో స్థానికేతరులుగా చూపుతున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన మొదలైంది. ఈ అంశంపై అవగాహన లేని కొందరు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు కొత్త టెన్షన్ మొదలైంది.
ఇంజినీరింగ్లో ప్రవేశానికి ముందు నాలుగేళ్లల్లో ఏ ఒక్క ఏడాది వేరే రాష్ట్రంలో చదివినా వారిని స్థానికేతరులుగా పరిగణిస్తోంది ఏపీ ప్రభుత్వం. గతంలో ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర, ఏయూ రీజియన్లు ఉండేవ. విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో ఉస్మానియా రీజియన్ కోటాను తొలగించింది. దీంతో కొత్త రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.
ALSO READ: అనుకున్నట్లుగానే జరిగింది.. జగన్ టూర్లో తల పగిలింది
ఉద్యోగ, ఉపాధి కారణాలతో తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉండి, ఎవరైనా ఒకరు పదేళ్లపాటు ఏపీలో ఉంటే వారిని స్థానికేతర కోటాలో 15 శాతం ఇంజనీరింగ్ సీట్లకు పోటీ పడొచ్చు. అయితే కొంతమంది తల్లిదండ్రులు ఏపీలో ఉన్నా, పిల్లలను తెలంగాణలో ఇంటర్ చదివించారు. ఇప్పుడు వీళ్లు స్థానికేతర కోటా కావాలంటే 10ఏళ్లు ఏపీలో ఉంటున్నట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. పిల్లలకు స్థానిక కోటా లభించకపోవడంపై కొందరు తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
వృత్తి విద్య, డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు గతేడాది వరకు స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ విధానం ఉండేది. ఈ ఏడాది వాటిని మార్పు చేసింది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలోని సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే లభించేలా కొత్త జీఓ తీసుకొచ్చింది. 2025-26 ఏడాది స్థానికేతర కోటా 15 శాతం సీట్లు ఏపీ విద్యార్థులకే కేటాయించనున్నారు.
రాయలసీమ ప్రాంతానికి చెందినవారు వారి పిల్లల్ని పొరుగున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చదివిస్తున్నారు. ఎగ్జాంఫుల్ వైజాగ్కి చెందిన వ్యక్తి తమ కొడుకుని పదో తరగతి వరకు ఏపీలో చదివించారు. ఇంటర్ హైదరాబాద్లో చదివించారు. EAPCET ప్రవేశ పరీక్షలో ఆ విద్యార్థికి మంచి ర్యాంకు వచ్చింది.
ఏపీలో మంచి ఇంజినీరింగ్ కాలేజీలో సీటు వస్తుందని భావించారు. చివరకు ఆ విద్యార్థిని నాన్ లోకల్ అని చూపించడంతో ఖంగుతిన్నారు. పదో తరగతి వరకు ఏపీలో చదివారని, వారిని లోకల్ కింద పరిగణించాలని కోరుతున్నారు. ఈ రూల్స్ తెలియక చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.