Eluru MP: మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కేసులు పెట్టడం సాధారణం. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టడానికి యంత్రాంగం ఎప్పుడూ అలర్ట్గా ఉంటుంది. అయితే, ఏలూరు జిల్లాలో మాత్రం ఓ విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. ‘తాగి బండెక్కితే కేసులు పెట్టకండి.. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది’ అంటూ ఏలూరు పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) పుట్టా మహేష్ కుమార్ పోలీసులకు క్లాస్ పీకడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
దిశ సమావేశంలో ఎంపీ వ్యాఖ్యలు
ఏలూరు కలెక్టరేట్లో ఇటీవల నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమావేశంలో భాగంగా పోలీస్ శాఖ పనితీరుపై చర్చ నడుస్తున్న సమయంలో ఎంపీ మహేష్ కుమార్ జోక్యం చేసుకున్నారు. నియోజకవర్గంలో పోలీసులు విపరీతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నారని, దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం.. క్షణాల్లో కాలిబూడిదైన కారు
రోజుకు 30 ఫోన్ కాల్స్ మందుబాబులవే!
కేసులు పెట్టడం వల్ల తనకు వస్తున్న ఇబ్బందులను కూడా ఎంపీ ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయిన మందుబాబులు, వారి బంధువుల నుంచి తనకు రోజుకు కనీసం 30 ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. స్టేషన్ నుంచి విడిపించాలంటూ ఫోన్లు చేసి విసిగిస్తున్నారని, ఈ తలనొప్పి భరించలేకపోతున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మా కార్యకర్తలకు కాస్త ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి
ఎంపీ వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ వెంటనే స్పందించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణనష్టాన్ని నివారించడానికే కేసులు నమోదు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఎస్పీ సమాధానంతో ఎంపీ శాంతించలేదు. చట్టం తన పని తాను చేసుకోవడం మంచిదేనని అంటూనే.. ‘మా పార్టీ కార్యకర్తలకు, స్థానికులకు కాస్త ఫ్లెక్సిబిలిటీ (మినహాయింపు) ఇవ్వాలి కదా’ అంటూ పోలీసులను రిక్వెస్ట్ చేయడం గమనార్హం. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులనే రూల్స్ బ్రేక్ చేయమనడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.