Nellore: నెల్లూరు జిల్లాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు తన తండ్రిని పోలీసులకు పట్టించాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు మేటరేంటి? పోలీసులు ఎందుకు అక్కడికి వెళ్లారు. ఇంకాస్త లోతుల్లోకి వెళ్లొద్దాం.
నెల్లూరు జిల్లా అనంతసాగరం గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులోభాగంగా సురేశ్ అన వ్యక్తి తన బైక్ పోలీసులకు కనిపించకుండా ఓ దగ్గర దాచి పెట్టాడు. తండ్రి చేస్తున్న ఈ పనులను అతడి ఐదేళ్ల కొడుకు దగ్గరుండి గమనించాడు. పోలీసుల దగ్గరకు వెళ్లి తన తండ్రి బైక్ దాచిన విషయాన్ని చెప్పాడు. అంతేకాదు ఎక్కడ దాచాడో స్వయంగా చూపించాడు కూడా. సార్.. మీరు వస్తున్నారని మా నాన్న బైక్ దాచి పెట్టాడు, రండి ఆ ప్లేస్ చూపిస్తానంటూ పోలీసులను వెంట బెట్టుకుని ఆ ప్రాంతానికి తీసుకెళ్లాడు. బాలుడి మాటలతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆ బైక్ను గుర్తించారు.
పోలీసులు ఆ బైక్ను బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. సొంత కొడుకు.. పోలీసులకు చెప్పి పట్టించడంతో ఆ తండ్రి నోటి వెంట ఒక్కమాట రాలేదు. ఈ సమయంలో ఐదేళ్ల బాలుడి నిజాయితీ, చూసి స్థానికులు-పోలీసులు నవ్వుకున్నారు. తండ్రి తప్పించుకోవాలని చూస్తే.. కొడుకు పోలీసుల దగ్గరకు వెళ్లి నిజం చెప్పడాన్ని అందరు ఆశ్చర్యపోయారు. ఆ బాలుడు నిజాయితీతో పని చేశాడే తప్ప, తండ్రిని పోలీసులకు పట్టించాలనే ఉద్దేశం అస్సలు కాదు. ఐదేళ్ల బుడతడు తన తండ్రికి ఊహించని షాకిచ్చాడు. తండ్రి చేసిన పనిని నిజాయితీగా పోలీసులకు చెప్పిన బాలుడ్ని అభినందించారు.
ALSO READ: ఈడీ స్టేట్మెంట్.. లెక్కచూపని రూ. 24 లక్షలు సీజ్, ఎంపీ అవినాష్ ఇళ్లపై సోదాలు
చిన్న వయసులో నిజాయితీ చూపించిన శభాష్ మహేంద్ర అంటూ ప్రశంసించారు పోలీసులు. ఆ తర్వాత స్థానికులకు కొన్ని సూచనలు చేశారు పోలీసులు. సైబర్ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తులతో చాట్ చేస్తూ ఇబ్బంది పడొద్దన్నారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.