Raksha Bandhan 2026: అన్నాచెల్లెళ్ల అనురాగానికి, అక్కాతమ్ముళ్ల ప్రేమాభిమానాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షా బంధన్. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ వేడుకను ఎంతో వైభవంగా జరుపుకుంటాం. అయితే 2026లో రాఖీ పండుగ ఏ రోజున జరుపుకోవాలనే దానిపై చాలామందిలో ఒక చిన్నపాటి అయోమయం నెలకొంది. ఆగస్టు 27న చేయాలా లేక 28న జరుపుకోవాలా అనే సందేహాలకు పంచాంగకర్తలు స్పష్టత ఇచ్చారు.
హిందూ పంచాంగం ప్రకారం.. ఈసారి శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28వ తేదీ ఉదయం 9:48 గంటల వరకు ఉంటుంది. మన శాస్త్రాల ప్రకారం ఉదయ తిథికే ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి.. పండితులు ఆగస్టు 28నే రక్షా బంధన్ పండుగను జరుపుకోవాలని నిర్ణయించారు.
పండుగ రోజున సోదరులకు రాఖీ కట్టడానికి ఉదయం సమయమే ఎంతో శ్రేష్ఠమైనది. ఆగస్టు 28న ఉదయం 6:23 గంటల నుంచి ఉదయం 9:48 గంటల వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన శుభ ముహూర్తం ఉంది. ఒకవేళ ఆ సమయంలో వీలు కాకపోతే.. మధ్యాహ్నం 12:14 గంటల నుంచి 1:05 గంటల వరకు ఉండే అభిజిత్ ముహూర్తంలో కూడా రాఖీలు కట్టుకోవచ్చు.
Also Read: కెమెరా హిస్టరీలోనే బిగ్ చేంజ్.. 68MP స్క్వేర్ సెల్ఫీ కెమెరాతో వస్తున్న కొత్త ఫోన్ ఇదే!
ఈ ఏడాది రక్షా బంధన్ రోజే కన్యా రాశిలో చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది. ఉదయం 8:04 గంటల నుంచి 11:22 గంటల వరకు ఈ గ్రహణ సమయం ఉంటుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి.. దీనికి ఎలాంటి సూతకం గానీ, దోషం గానీ వర్తించవు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా శుభ ముహూర్తంలో రాఖీ కట్టుకోవచ్చు.
రక్షా బంధన్ వెనుక అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. పూర్వం శ్రీకృష్ణుని వేలికి గాయమై రక్తం కారుతుంటే, ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టింది. దానికి మెచ్చిన కృష్ణుడు ఆమెకు ఆపద సమయంలో అండగా ఉంటానని మాట ఇచ్చి, ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమె మానాన్ని కాపాడాడు. అలాగే లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి, పాతాళంలో ఉన్న విష్ణుమూర్తిని వైకుంఠానికి తీసుకువెళ్లినట్లు కూడా చెబుతారు.
పురాణాలే కాకుండా చరిత్రలోనూ రాఖీకి ప్రత్యేక స్థానం ఉంది. మేవార్ రాణి కర్ణావతి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రాఖీ పంపి సాయం కోరింది. ఆ దారపు పొగును తోడబుట్టిన చెల్లి ప్రేమగా భావించిన హుమాయూన్, వెంటనే సైన్యంతో వచ్చి ఆమె రాజ్యాన్ని రక్షించడానికి ముందుకొచ్చాడు. అలా కాలాలు మారినా, రాఖీ బంధం ప్రాధాన్యత మాత్రం చెక్కుచెదరకుండా వస్తోంది.
Also Read: బ్లూటూత్ కాలింగ్, 140+ స్పోర్ట్స్ మోడ్స్.. షియోమీ నుంచి రూ.5,000కే అమోలెడ్ డిస్ప్లే స్మార్ట్వాచ్!