Former CM’s Successor in AP Elections 2024: ఏపీ రాజకీయాల్లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒకే ఇంటి నుంచి ఇద్దరు,ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తుంటే..మరి కొన్ని చోట్ల దగ్గరి బంధువులు ఎన్నికల బరిలో దిగారు. పదవే పరమావధిగా ఎన్నికల పోరులో రాజకీయ నేతల వారసులు కదనరంగంలో కాలు దువ్వుతున్నారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రుల వారసులు కూడా ఉన్నారు.ఏకంగా ఆరుగురు సీఎంల పిల్లలు ఎనినిమిది మంది అభ్యర్థులు రాజకీయ రణక్షేత్రంలో హోరాహోరీ తలపడుతున్నారు.
ఏపీ 2024 ఎన్నికల్లో రాజకీయ వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆరుగురు మాజీ సీఎంల కుటుంబాలు హోరా హోరీ తలపడుతున్నాయి. 8 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ సత్తా చాటేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దర్ రెడ్డి,చంద్రబాబుల వారసులు తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కొందరు అధికార పార్టీ అభ్యర్థులుగా బరిలో దిగారు.
ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి సీఎం జగన్ ఎప్పటిలాగే కడప జిల్లా పులివెందుల నుంచి బరిలో నిలిచారు. తండ్రి పేరిట స్థాపించిన పార్టీని గత ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చారు. తాజా ఎన్నికల్లో పులివెందుల టీడీపీ నుంచి బీటెక్ రవిగా సూపరచితమైన రవీంద్రనాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కడప జిల్లాలో షర్మిల లోక్ సభ అభ్యర్థిగా ఈ సారి ఎన్నికల బరిలో దిగారు. కడపలో షర్మిల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ చీఫ్ గా పర్యటిస్తూనే కడప లోక్ సభ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు.
Also Read: Gannavaram Assembly Constituency: గన్నవరం గడ్డ.. ఎవరిది అడ్డా?
జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేస్తూనే..మరో సోదరుడైన అవినాష్ రెడ్డిపై పోటీకి దిగారు. ఏపీ రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బీసీల పొలిటికల్ అడ్డా అయిన మంగళగిరిలో మరో రాజకీయ వారసుడు లోకేష్ బరిలో దిగారు. మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరిలో రెండో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన సీఎం నందమూరి తారక రామరావు వారసులు ప్రస్తుత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఎన్టీఆర్ కొడుకు, కుమార్తెతో పాటు..40 ఏళ్లుగా కుప్పంలో పాగా వేసిన చంద్రబాబు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. చంద్రబాబుపై వైసీపీ అభ్యర్థి భరత్ పోటీ చేస్తున్నారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుంచి మూడో సారి పోటీకి దిగుతున్నారు. బాలకృష్ణపై వైసీపీ అభ్యర్థి టీజీఎన్ దీపిక పోటీ చేస్తున్నారు.
Also Read:చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే: జగన్
రాజమండ్రి లోక్ సభ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి బరిలో దిగారు. మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి , నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారులు సూర్య ప్రకాష్ రెడ్డి, రాం కుమార్ రెడ్డిలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో మాజీ సీఎంల వారసుల గెలుపు ఓటములపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.