Rain Alert: రాత్రి నుంచి రెండు రాష్ట్రాల్లో వాతావరణం బాగా చల్లబడ్డది. మన తెలంగాణల చూసుకుంటే.. రాత్రి నుంచి కండ్ల ముందే ముసురు పట్టింది. హైదరాబాద్, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి గట్టిగానే వానలు పడుతున్నాయి. ఆకాశం అంతా మబ్బులు పట్టి, చినుకులు రాలుతుంటే ఎండల వేడి నుంచి జనాలకు కాస్త ఉపశమనం దొరికినట్టే అనిపించినా.. రోడ్లన్నీ జలమయం కావడంతో ఆఫీసులకు, పనులకుపోయేటోళ్లు తెగ ఇబ్బందులు పడుతున్నారు.
ఈదురుగాలులు, రాత్రంతా కరెంట్ కట్..
ఇక రాత్రి నుంచి వానతో పాటు గట్టిగా ఈదురుగాలులు వీచడంతో కథ వేరేలా మారింది. చాలా చోట్ల పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిగి కరెంట్ తీగల మీద పడటంతో రాత్రి నుంచి కరెంట్ పోయింది. గంటల తరబడి అంధకారంలోనే గడపాల్సి వచ్చింది. ఉరుములు, మెరుపుల హోరుతో చాలా ప్రాంతాల్లో డిపార్ట్మెంట్ వాళ్లు ముందు జాగ్రత్తగా కరెంట్ కోత పెట్టారు. పొద్దుగాల కూడా కొన్ని జిల్లాల్లో ఇంకా లైట్లు రాకపోయేసరికి ఇండ్లల్లో నీళ్ల ఇబ్బందులు మొదలయ్యాయి. అధికారులు మాత్రం లైన్లు క్లియర్ చేసే పనిలోనే బిజీగా ఉన్నారు.
ఆంధ్రాలోనూ దంచికొడుతున్న వానలు..
అలాగే అటు ఆంధ్రా గడ్డ మీద కూడా వానల జోరు మాములుగా లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) గట్టిగానే హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో వానలు దంచికొట్టేలా ఉన్నాయని చెప్పారు. తీర ప్రాంత ప్రజలు, చెరువుల పొంటి ఉండేటోళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
రెండు రాష్ట్రాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో రైతన్నలు ఒకపక్క సంతోషపడుతుంటే.. ఇంకోపక్క లోతట్టు ప్రాంతాల జనాలు ఆగమాగం అవుతున్నారు. రాబోయే మరికొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి ఉండేలా కనిపిస్తోంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: క్రూడాయిల్ తగ్గినా.. పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గట్లేదు? క్లారిటీ ఇచ్చిన హర్దీప్ పూరి