Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర నడుమ వేడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా డీఎస్సీ అంశంపై చర్చ జరపాలంటూ విపక్ష వైసీపీ సభ్యులు పట్టుబట్టడం, దానికి ప్రభుత్వం సమాధానమిచ్చిన తీరుతో మండలి రెండో రోజు సభలో తీవ్ర గందరగోళం నెలకుంది.
వైసీపీకి ఇష్టమొచ్చినట్లు నడవదు: పయ్యావుల
వైసీపీ ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగడంపై శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వాన్ని ఎవరు నడపాలనేది ప్రజలు తీర్పు ఇచ్చి డిసైడ్ చేశారు. ఏ సబ్జెక్ట్పై ఎప్పుడు చర్చ జరగాలనేది ప్రభుత్వ ఛాయిస్. అంతే తప్ప ఈ సభ వైసీపీకి ఇష్టమొచ్చినట్లు నడవదు’ అని పయ్యావుల ఘాటుగా స్పష్టం చేశారు. ఛైర్మన్ను అగౌరవపరిచేలా వ్యవహరించడం సరికాదన్నారు. తాము డీఎస్సీపై చర్చకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు.
ప్రజా సమస్యలు వదిలేసి అల్లరి చేస్తున్నారు
ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, తాగు, సాగునీటి కరువు సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. వాటిపై ముందుగా చర్చించాలనే ఆలోచన వైసీపీ నాయకులకు లేదా అని మంత్రి ప్రశ్నించారు. కేవలం అల్లరి చేసి సభ నుంచి వెళ్లిపోవాలనేదే వైసీపీ సభ్యుల ఉద్దేశమని విమర్శించారు. ‘డీఎస్సీ అంటేనే తెలుగుదేశం పార్టీ. మేము గతంలో 14 సార్లు డీఎస్సీలు ఇచ్చాం. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని బొత్స సత్యనారాయణ, ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అని పయ్యావుల ఎద్దేవా చేశారు.
బీఏసీ సమావేశానికి ఛైర్మన్ సూచన
సభలో ఇరువైపులా తీవ్ర వాగ్వాదం, నినాదాల హోరు పెరగడంతో ఛైర్మన్ మోషేన్ రాజు సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఏ ఏ అంశాలపై చర్చ జరపాలనేది నిర్ణయించేందుకు మరోసారి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహిద్దామని ఛైర్మన్ ఈ సందర్భంగా సభ్యులకు సూచించారు.
Also Read: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై కోర్టు స్టే.. రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు!