Botsa Satyanarayana: డీఎస్సీ ఎంపిక విధానం, అభ్యర్థుల అర్హతలపై ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, అధికారంలో ఉన్న నాయకులు తమ బాధ్యతల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మండలిలో చర్చకు వెనకడుగు ఎందుకు?
శాసనసభలో డీఎస్సీ అంశంపై మాట్లాడిన ప్రభుత్వం, శాసనమండలికి వచ్చేసరికి ఎందుకు పారిపోతోందని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయంపై చర్చకు తామే విజ్ఞప్తి చేశామని, అయితే సభకు వ్యవసాయ శాఖ మంత్రి రాకుండానే చర్చ చేపడతామనడం సరికాదన్నారు. డీఎస్సీపై సవాల్ విసురుతున్న మంత్రి నారా లోకేష్, మండలికి వచ్చి నేరుగా చర్చించకుండా దాగొనే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అదే విధంగా లోకేష్ సవాల్ పై స్పందిస్తూ.. మేము కుస్తీ పోటీలకు రావడం లేదని.. డీఎస్సీ పై చర్చకు వస్తున్నాం అంటూ బొత్స కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు లోకేష్ ఇచ్చిన సమాధానాలు తప్పులు జరిగాయనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లే ఉన్నాయని బొత్స అభిప్రాయపడ్డారు.
అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు
డీఎస్సీ మార్కులను పరిగణనలోకి తీసుకోబోమని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన చైతన్య అనే అభ్యర్థికి ర్యాంకు వచ్చినా ఎన్ఓసీ లేదనే నెపంతో నిరాకరించడం దారుణమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఎన్ఓసీ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే డీఎస్సీ ఎంపిక జాబితాలను కలెక్టర్ కార్యాలయాల్లో ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను పక్కనబెట్టిన ప్రభుత్వం
రైతుల సమస్యలు, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరూ చూశారని మంత్రి పయ్యావుల కౌంటర్ కు సమాధానమిచ్చారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో వోక్స్ వ్యాగన్ కేసులో స్వయంగా తన శాఖను మార్చి సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు పూర్తిస్థాయి స్పష్టమైన ఆదేశం ఇచ్చారని, అందుకే వారి వైఫల్యాలను ఐదేళ్ల పాటు భరించక తప్పదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
Also Read: ఏపీ శాసనమండలిలో సీన్ రివర్స్.. పయ్యావుల పంచ్లకు వైసీపీ సైలెంట్!