ఇటీవల మాజీ సీఎం జగన్ క్రెడిట్ చోరీ అంటూ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన హయాంలో కట్టించడం మొదలు పెట్టిన ఇళ్లను పూర్తి చేసి, అవి తమ హయాంలో ఇచ్చామంటూ చంద్రబాబు చెప్పుకుంటున్నారని అన్నారు. ఆమధ్య మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. మెడికల్ కాలేజీలు తాను తెచ్చానని, వాటిని పూర్తి చేస్తూ చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నారని అన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాకకు అప్పట్లో తాను అదానీతో కలసి ఫౌండేషన్ వేసినట్టు చెప్పారు జగన్. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే జగన్ తన తప్పుల్ని, తన లోపాల్ని, తన చేతగాని తనాన్ని తానే చెప్పుకుంటున్నారని అర్థమవుతోంది. ఏ పనీ పూర్తిగా చేయని, చేయలేని అసమర్థ సీఎంగా తనపై తాను ముద్రవేసుకుంటున్నారు జగన్. ఆ పనులన్నీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే చేసేశారని కూడా జగనే సర్టిఫికెట్లు ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. ఇక క్రెడిట్ ఎవరికివ్వాలనేది ప్రజలే నిర్ణయించుకుంటారు.
పునాది క్రెడిట్ నాదే..!
ఇటీవల 3 లక్ష ఇళ్ల గృహప్రవేశాలు అంటూ ప్రభుత్వం హడావిడి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లి నుంచి శ్రీకారం చుట్టారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా సీఎం ఇళ్లను వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై జగన్ క్రెడిట్ చోరీ అంటూ ట్వీట్ వేశారు. చంద్రబాబు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా వారు ఇవ్వలేదని, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించలేదని.. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు తమ హయాంలోనే పూర్తయ్యే దశలోకి వచ్చాయని, మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకూ నిర్మంచామని, శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. అంతా బాగానే ఉంది కానీ, తన చేతగాని తనాన్ని మరీ ఇంత బహిరంగంగా జగన్ చెప్పుకోవడమే ఇక్కడ విచిత్రం. తాను పూర్తి చేయలేకపోయిన ఇళ్లను చంద్రబాబు అధికారంలోకి వచ్చి పూర్తి చేశారని పరోక్షంగా ప్రజలకు గుర్తు చేశారు జగన్.
చంద్రబాబుగారూ… మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది.
పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా..
ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా…
దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా……— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2025
అన్నీ అంతేనా..?
జగన్ అధికారంలోకి వచ్చే ముందు చాలా హుషారుగా ఉండేవారు. ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తాననేవారు, తనను అధికారంలోకి రప్పిస్తే మద్యం కనపడకుండా చేస్తాననేవారు, సీపీఎస్ ఒక్క సంతకంతో రద్దు చేస్తానన్నారు. కానీ అవేవీ తనకు కుదరని పనులని అధికారంలోకి వచ్చాక ఆయనకు బోధపడింది. పోలవరం విషయంలోనే నాలుగు డెడ్ లైన్లు పెట్టి మరీ వైసీపీ మంత్రులు నవ్వులపాలయ్యారు. చివరకు పోలవరం పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణం అన్నారు. టీడీపీ హయాంలో మొదలైన టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులేయడం మినహా జగన్ ఇంకేమీ చేయలేదనే అపవాదు ఉంది. అయితే ఇవేవీ తన ఓటమికి కారణం కాదు అని జగన్ నమ్మడమే ఇక్కడ విచిత్రం.
Also Read: ఈ మున్నాభాయ్ మహా ముదురు.. నితీష్ కుమార్ అలాంటివాడా? మీకు తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్
ఇంత బేలగా అయితే ఎలా?
తాను మొదలు పెట్టిన పనులకు చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నారని చెప్పుకుంటున్న జగన్, ఆయా పనుల్ని తాను పూర్తి చేయలేకపోయాననే విషయాన్ని ప్రజల వద్ద ఒప్పుకోవాల్సి వస్తోంది. ఆ పనులన్నీ తన హయాంలో పూర్తి చేసి ఉంటే ప్రజలు తననే రెండోసారి ఎన్నుకునే వారనే వాస్తవాన్ని మాత్రం ఆయన మరచిపోతున్నారు. ఇప్పటికైనా క్రెడిట్ చోరీ అంటూ విమర్శలు చేసి నవ్వులపాలవకుండా ఉంటే చాలని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
Also Read: జూబ్లీ హిల్స్ గుణపాఠం.. కేటీఆర్ ఇకనైనా గ్రౌండ్ రియాల్టీ అర్థం చేసుకుంటారా?
Also Read: రేవంత్ నాయకత్వానికి ఢోకా లేనట్టే