PM Kisan Scheme: రైతన్నల కోసం కేంద్రం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోంది. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్న లక్ష్యంతో రైతుల కోసం పీఎం కిసాన్ నగదును జమ చేస్తోంది. అయితే కొందరు రైతులు ఈ స్కీమ్ గురించి సరైన అవగాహన లేక లబ్ది పొందలేక పోతున్నారని చెప్పవచ్చు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం 2019లో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్రం దేశంలోని రైతులందరికీ లబ్ది చేకూర్చేందుకు పథకం అమలు చేస్తోంది. అందుకే రైతులు పథక లబ్ది కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది.
ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ. 6 వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తారు. అర్హులైన రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2 వేలు జమ చేస్తారు. అయితే అందుకు రైతన్నలు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే రైతుల ఖాతాలలో నగదు జమ కావడం ఖాయం. అయితే పీఎం కిసాన్ 19 వ విడత నగదును కేంద్రం ఫిబ్రవరిలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఇంకా చాలా మంది రైతులు ఈ కేవైసీ పై సరైన అవగాహన లేక సరైన సమయానికి చేయించుకోక పోవడంతో, నగదు జమ కాలేదని చెప్పవచ్చు. అటువంటి రైతులందరూ ఈనెల 31 లోగా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
అప్పుడే 19 వ విడతలో జమ అయ్యే రూ. 2 వేల నగదు ఖాతాకు చేరుతుందని, ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని కేంద్రం ప్రకటించింది. అయితే సులభ పద్దతిలో ఈ కేవైసీ చేయించుకోవచ్చని, అందుకు pmkisan.gov.in సైట్ లో సులభంగా ఈ కేవైసీ చేసుకొనే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. సైట్ ఓపెన్ చేసిన అనంతరం, కుడివైపున ఉండే ఈ కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సిన అవసరం ఉంది.
అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే, మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వచ్చేందుకు ఆధార్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం అయి ఉండాలి. అప్పుడు ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే, ఈ కేవైసీకి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. ఇంకా ఈకేవైసీ పై ఏవైనా సందేహాలు ఉంటే, తప్పనిసరిగా స్థానిక మీసేవ సెంటర్లను సంప్రదించాలని రైతన్నలను కేంద్రం కోరింది. మరి మీరు 19వ విడత పీఎం కిసాన్ నగదు కోసం వేచి ఉన్నారా.. ముందు ఈ కేవైసీ చేయించుకున్నారో లేదో చెక్ చేయండి. లేకుంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి. ఈ ప్రక్రియకు ఈనెల 31వరకే గడువు.. మరచిపోవద్దు సుమా!