NTR : నందమూరి తారక రామారావు కోట్లాది ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారని ప్రధాని మోదీ అన్నారు. 101వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని ప్రసంగించారు. ఈ సమయంలో శత జయంతి వేళ ఎన్టీఆర్కు శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయాలతోపాటు చిత్రరంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. తన నటనాకౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్ జీవం పోశారని గుర్తు చేశారు.
బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినీరంగంలో పేరు తెచ్చుకున్నారని మోదీ కొనియాడారు. కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారన్నారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించారని పేర్కొన్నారు. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ నటనను ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారని మోదీ చెప్పారు.
దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే 25 ఏళ్లు చాలా కీలకమని మోదీ అన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ నినాదాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువ సంగమం పేరుతో విద్యాశాఖ ఓ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ప్రజలతో మమేకం చేయడం ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రధాని మోదీ తెలిపారు.