Visakhapatnam: ఏపీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం అమరావతి వస్తున్నారు. కొద్ది గంటలు మాత్రమే గడుపుతారు ఆయన. అమరావతి పునర్నిర్మాణ పనులను శ్రీకారం చుట్టనున్నారు. వీటితోపాటు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో విశాఖ సిటీలో యూనిటీ మాల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మాల్ స్పెషల్ ఏంటి? ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి కారణమేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం.
యూనిటీ మాల్ స్పెషల్ ఏంటి?
కొద్దిరోజుల కిందట విశాఖకు కొత్త మాల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. చేనేత, హస్తకళలను ప్రోత్సహించడానికి యూనిటీ మాల్ను ఏపీకి మంజూరు చేసింది. ఈ మాల్ను విశాఖలోని మధురవాడ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. దాదాపు రూ.172 కోట్లతో దీన్ని నిర్మాణం చేపడుతున్నారు.
మొదటి విడతగా రూ.86 కోట్లు ఇచ్చింది కేంద్రం. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో శుక్రవారం మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులతోపాటు యూనిటీ మాల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. కేవలం ఏడాదిలోపు మాల్ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్మాణానికి రూ.172 కోట్లను 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణంగా అందజేస్తుంది.
మధురవాడలో మాల్
మధురవాడ లోని సర్వే నెంబర్ 426/2లో ఐదు ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలని భావించింది ప్రభుత్వం. రుషికొండ బీచ్కు ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్రాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో ఉంటుంది. జీ ప్లస్ 4 అంతస్తుల్లో మొదటి రెండు అంతస్తుల్లో 62 షాపులు ఉండనున్నాయి. వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భౌగోళిక పరంగా గుర్తింపు పొందిన ఉత్పత్తులను ఇక్కడ అమ్మనున్నారు.
ALSO READ: అబ్బరుపరిచే అమరావతి, ఇదేం డిజైన్ బాబోయ్
యూనిటీ మాల్లో మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని దగ్గరగా చూడవచ్చు. నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్తోపాటు రెండు మినీ థియేటర్లు ఉంటాయి. రిటైల్ స్టోర్లు, ఫుడ్ కోర్టులు, వినోద ప్రదేశాలు, ఫిట్నెస్ సెంటర్లు, బ్యాంకులు, ఫర్నిచర్ షాపులు ఉంటాయి.
వీటి ద్వారా వచ్చే ఆదాయంతో కేంద్రం ఇచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మాల్ నిర్మాణం వేగంగా పూర్తి చేయడానికి కావల్సిన అన్నిచర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఆ ప్రాంతంలోకి ఉన్న ఐటీ, రానున్న కంపెనీలకు ఇదొక ఐకానిక్గా మారనుంది.