![Raghu Rama Krishnam Raju Likely To Join TDP Tomorrow](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/04/RaghuRama-Krishnam-Raju-Likely-To-Join-TDP-on-friday.jpg)
Raghu Rama Krishnam Raju Likely To Join TDP: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ-జనసేన-బీజేపీలు తమతమ అభ్యర్థులను ప్రకటించాయి. కూటమి మద్దతు తో ఇండిపెండెంట్గా పోటీ చేయాలని రఘురామ కృష్ణంరాజు భావించారు.
తాజాగా బిగ్ టీవీకి అందుతున్న సమాచారం మేరకు టీడీపీ-బీజేపీ మధ్య ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో స్వల్ప మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. నర్సాపురం నుంచి ఆయన టీడీపీ తరపున బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఒకవేళ నరసాపురం కాకపోతే ఉండి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్ కేటాయించింది బీజేపీ. అయితే నరసాపురం సీటుకు బదులుగా ఏలూరు టికెట్ కేటాయించాలన్నది టీడీపీ ప్లాన్. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్యాదవ్ పేరు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలో సీట్లు సర్దుబాటు జరిగే అవకాశముందని తెలుస్తోంది.
Also Read: ఏపీలో వలసల జోరు.. వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే
మరోవైపు కడప బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పేరు బలంగా వినబడుతోంది. ఒకవేళ టీడీపీ గనుక కడప ఎంపీ టికెట్ బీజేపీకి ఇస్తే.. జమ్మలమడుగు నుంచి భూపేష్రెడ్డి దించాలని ఆలోచన చేస్తోంది. ఆదినారాయణ సోదరుడు కొడుకు భూపేష్రెడ్డి. అలాగే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటును మొదటి నుంచి బీజేపీ ఆసక్తి చూపడంలేదు. అనపర్తి టీడీపీ తీసుకుని.. దాని బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి సీటును బీజేపీకి ఇవ్వనుంది.
మొత్తానికి సీట్ల అంశం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత.. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది బీజేపీ. ఈ వారంలో సీట్ల వ్యవహారం ఫైనల్ అవుతుందని, అనుకోని పరిస్థితుల్లో జాప్యం జరిగితే వచ్చేవారం ప్రకటించవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నారు.