Havelock Bridge Rajahmundry: ఒకప్పుడు రైలు రాకలతో మారుమోగిన బ్రిడ్జ్ ఇప్పుడు హోలోగ్రామ్ జంతువులతో అబ్బురపరిచేందుకు సిద్ధమవుతోంది. 1897లో బ్రిటిష్ హస్తంతో గోదావరి మీద నిర్మించిన హేవలాక్ బ్రిడ్జ్కి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం పోసేందుకు ముందుకొచ్చింది. ఖర్చు రూ.47 కోట్లు.. టార్గెట్ – 2027 పుష్కరాలకి ముందు పూర్తవ్వాలి.
రాజమండ్రిలోని గోదావరి తీరంలో నిలిచిన హేవలాక్ బ్రిడ్జ్ గురించి ఎవరికైనా చెబితే.. అదిగో పాత రైలు బ్రిడ్జ్ కదా అని అంటారు. కానీ ఈ బ్రిడ్జ్ చరిత్ర తెలియజేస్తే మాత్రం వారికే షాక్.. ఇది ఒక సాధారణ బ్రిడ్జ్ కాదు.. ఇది బ్రిటిష్ ఇంజినీరింగ్కు నిలువెత్తు ఉదాహరణ, వందేళ్ల రైలు ప్రయాణాల చరిత్రకు మూలధనం, ఆంధ్ర గర్వంగా నిలిచే నిర్మాణం.
ఇదంతా మొదలైనది 1890లో. బ్రిటిష్ పాలనలో సర్ ఆర్థర్ హేవలాక్ అనే ఇంజనీర్ ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. 1897లో పూర్తైన ఈ బ్రిడ్జ్ అప్పట్లో ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జ్గా గుర్తింపు పొందింది. మొత్తం 2.7 కిలోమీటర్ల పొడవుతో, 56 గిర్డర్ స్పాన్లతో, పూర్తి ఉక్కుతో గోదావరి మీదగా నిర్మించిన అద్భుత నిర్మాణం ఇది.
వందేళ్ల పాటు రైలు రాకపోకలు సాగిన తర్వాత, 1997లో బ్రిడ్జ్ సేవలను ఆపివేశారు. తర్వాత దీనిని కూల్చకుండా, రాజమండ్రి గుర్తుగా నిలవనివ్వాలన్న ఆలోచన చిగురించింది. ఇప్పుడదే ఆలోచన సాకారమవుతోంది.. పాత బ్రిడ్జ్కు కొత్త ఊపిరి, పర్యాటక కేంద్రంగా పునరుద్ధరణ!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ భారీ ప్రణాళికతో ముందుకొచ్చింది. ఏకంగా రూ.47 కోట్లు ఖర్చుతో ఈ హేవలాక్ బ్రిడ్జ్ను టూరిజం హబ్గా తీర్చిదిద్దనున్నారు. పుష్కరాల నాటికి పూర్తవ్వాలన్నది ముఖ్య లక్ష్యం. ఈ ప్రాజెక్టులో మామూలుగా చూసే బ్రిడ్జ్ కాదు.. పూర్తిగా ఒక డిజిటల్ విజన్. ఈ బ్రిడ్జ్పై 10 రకాల థీమ్ జోన్లు ఉండబోతున్నాయి. వాటిల్లో కొన్ని వినిపించిన వెంటనే అవునా నిజంగానే? అన్నంత అద్భుతంగా ఉంటాయి.
అక్వేరియం టన్నెల్.. నీటి కింద చేపల మధ్య నడుస్తున్న అనుభూతి, AI టైమ్ ట్రావెల్ టన్నెల్.. 1890ల బ్రిటిష్ కాలంలోకి తీసుకెళ్లే డిజిటల్ ప్రయాణం, హోలోగ్రామ్ జూ.. డిజిటల్ జంతువుల మాయా ప్రపంచం, స్పేస్ గ్యాలరీ.. అంతరిక్ష అనుభూతిని లైవ్గా చూపించే వేదిక, లైట్ షోలు, వారసత్వ డెక్లు, ఫుడ్ కోర్టులు, కల్చరల్ స్టేజీలు, సెల్ఫీ స్పాట్లు.. ఇంకా చాలానే ఇక్కడికి వస్తే మనల్ని పలకరించే రోజులు రాబోతున్నాయి.
Also Read: Guntur boy petition: కలెక్టర్ సార్.. అమ్మ చనిపోదాం అంటోంది.. గ్రీవెన్స్ లో ఓ బాలుడు అర్జీ!
ఈ ప్రాజెక్టు పూర్తయితే, రాజమండ్రి మీదే టూరిజం నడిచే రోజులు దూరం కావు. గోదావరి తీరాన రాత్రిళ్లు రంగురంగుల లైట్లతో మెరిసే బ్రిడ్జ్పై నడుస్తూ.. ఒకవైపు నది అలల శబ్దం, మరోవైపు డిజిటల్ ప్రదర్శనలు చూస్తూ పర్యాటకులు ఆనందించనున్నారు.
ఇక ఈ బ్రిడ్జ్ చరిత్రను టచ్ చేస్తే, ఎన్నో వింతలు బయటపడతాయి. అప్పట్లో లండన్ నుంచి షిప్పింగ్లో తెచ్చిన ఉక్కుతోనే ఈ బ్రిడ్జ్ను నిర్మించారు. ఒక్కో గిర్డర్ను గోదావరి మధ్యన పడవల మీద నుంచి లేపి అమర్చారట. అదేంటి అంటే.. అప్పటి టెక్నాలజీలోనే అంత ఖచ్చితంగా, అంత బలంగా నిర్మించగలిగారు. అప్పట్లో దీన్ని చూసి ఇది మద్రాసు ప్రెసిడెన్సీలోనే గొప్ప విజయం అన్నారట బ్రిటిష్ అధికారులు.
పాపికొండలు, ఇసుకతెప్పలు, గోదావరి ఘాట్లు వంటి ఎన్నో పర్యాటక కేంద్రాలతో పాటు ఇప్పుడు హేవలాక్ బ్రిడ్జ్ కూడా టాప్ లిస్టులో చేరబోతోంది. పుష్కరాల సందర్భంలో లక్షల మంది భక్తులు వస్తారు. అప్పుడు ఈ బ్రిడ్జ్పైన కల్చరల్ షోలు, ప్రయాణికులకు ప్రత్యేక ప్రవేశాలు, రాత్రిపూట లేజర్ షోలు.. ఇవన్నీ గోదావరి పండుగను మరింత వైభవంగా మార్చనున్నాయి.
బ్రిడ్జ్ కాస్త చెదిరినా.. గౌరవం మాత్రం చెడిపోలేదు. ఇప్పుడు అదే గౌరవాన్ని కొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నం ఇది. ఇది చరిత్రను భవిష్యత్తుతో కలిపే చక్కని మెలకువ. పాత బ్రిడ్జ్ను కూల్చకుండా.. కొత్త తరం పిల్లలకు ఓ స్మృతి స్థూపంలా నిలిపేందుకు ఇది చక్కని అడుగుగా రాజమండ్రి వాసులు అంటున్నారు.