Rs 700 Cr Land Grabbing Case : గత ప్రభుత్వంలో అనేక మంది ప్రభుత్వ పెద్దలతో తనకు సత్సంబంధాలున్నాయని వెల్లడించిన చిమకుర్తి శ్రీకాంత్.. అప్పటి రిజిస్ట్రార్ల ఆస్తులపై సంచనల విషయాలు వెల్లడించారు. తనకు రీతు చౌదరికి జరిగిన విషయాల నుంచి తనకున్న ఆస్తుల వరకు అనేక విషయాలపై మాట్లాడారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల, ప్రభుత్వ అధికారులతో తనకున్న పరిచయాలకు సంబంధించిన ఆధారాల గురించి, ఏసీబీ సోదాల వరకు అనేక విషయాలపై స్పష్టతనిచ్చారు. చిమకుర్తి శ్రీకాంత్ పై భారీ భూ కుంభకోణ ఆరోపణలు వచ్చినప్పటి తర్వాత బిగ్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకారంత్.. అనేక ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెంచిన రూ.700 కోట్ల అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ప్రధాన వ్యక్తిగా అరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్.. తనకు సినిమా రంగంలో ఎవరితోనూ వ్యక్తిగత పరిచయాలు లేవని తెలిపారు. అప్ కమింగ్ హీరోయిన్లతో వ్యాపారం చేస్తారనే ఆరోపణలపై ప్రశ్నించగా.. అలాంటివన్ని అబద్ధమని కొట్టిపారేశారు. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని, అప్ కమింగ్ అమ్మాయిలు, ఛాన్సులు కోసం ఎదురు చూసే వారితో తనకు పరిచయాలు లేవని తెలిపారు.
రీతు చౌదరితో గొడవలు ఏంటి.?
రీతూ చౌదరితో వివాదం పై ప్రశ్నించగా.. ఏసీబీ కేసు తర్వాతే తామిద్దరి మధ్య గొడవలు మొదలైయ్యాయని తెలిపారు. ఏసీబీ అధికారులు తన గురించి లేనిపోని విషయాల్ని రీతూ దగ్గర చెప్పారని, తనను భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. గతంలో ఎప్పుడో జరిగిన విషయాన్ని అవసరం లేకున్నా.. ఆమె దగ్గరకు తీసుకొచ్చి.. కావాలనే తనపై రీతూ దగ్గర దుష్ప్రచారం చేశారని అన్నారు. ఏసీబీ అధికారుల కేసులు, చెప్పిన మాటలతో ఆమె భయపడిపోయి తన నుంచి దూరం జరిగినట్లు వెల్లడించారు. అంతకు ముందు తాము బాగానే ఉన్నామని.. ఏసీబీ రైడ్ తర్వాతే సమస్యలు తలెత్తినట్లు వెల్లడించారు.
అక్రమంగా భూముల్ని ఆక్రమించుకుని.. రిజిస్ట్రార్లతో తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న వేళ.. రీతూపై ఆస్తుల గురించి బిగ్ టీవీ ప్రశ్నించింది. రీతూ మీదు ఆస్తుల్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారని ప్రశ్నించగా.. తామిద్దరం బంధంలో ఉన్నప్పుడు జరిగిన విషయమని.. తాను నేరుగా రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. కేవలం తాను అందుబాటులో లేనందునే.. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) చేయించానని తెలిపారు. రీతూ చౌదరికి ఆరోపణలు వస్తున్న ఆస్తుల గురించి కానీ, అధికారుల గురించి కానీ ఎలాంటి విషయాలు తెలియవన్నారు. ఆమెకు అవగాహన కూడా లేదని అన్నారు. ఈ వ్యవహారం పూర్తిగా తనకు సంబంధించిన అంశమేనన్నారు.
మీ ఆస్తుల విలువ ఎంత.?
మీడియాలో చెబుతున్నట్లుగా తనకు వందలు, వేల కోట్ల ఆస్తులు లేవని అన్నారు. ఏసీబీ స్థంబింపజేసిన ఆస్తుల మొత్తం విలువ తెలపని చిమకుర్తి శ్రీకాంత్.. అన్ని చిన్న మొత్తాలే అని తెలిపారు. తాను మొదటి నుంచి రియల్ ఎస్టేట్ ద్వారానే చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టి, వాటిని అమ్ముతూ, కొంటూ ఆస్తుల్ని పెంచుకుంటున్నట్లు తెలిపారు. తాను తప్పుడు పనులు చేసే వాడిని అయితే.. కుటుంబ సభ్యుల పేర్లపై ఆస్తులు ఎందుకుంటాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏసీబీ ఫ్రీజ్ చేసిన ఆస్తుల్లో తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయని అన్నారు.
అక్రమార్కులు రిజిస్ట్రార్లు..
రాష్ట్రంలో రిజిస్ట్రార్ల వ్యవహారంపై స్పందించిన శ్రీకాంత్.. ప్రతీ పోస్టింగ్ వెనుక అవినీతి జరిగింది అని ఆరోపించారు. ఇబ్రహీం పట్నం మాజీ రిజిస్ట్రార్, ఈ కేసులో ప్రధాన వ్యక్తిగా ఉన్న ధర్మా సింగ్ పెద్ద అవినీతి పరుడని ఆరోపించిన చీమకుర్తి శ్రీకాంత్.. కిషోర్ కుమార్ అనే వ్యక్తి అతని బినామి అని వెల్లడించారు. గతంలో సరైన డాక్యుమెంట్లు లేని ఓ ఆస్తిని తక్కువ ధరకు తాను కిషోర్ కుమార్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు.
తనకు చాలా మంది సబ్ రిజిస్ట్రార్ లు పరిచయం ఉన్నట్లు తెలిపిన శ్రీకాంత్.. రిజిస్ట్రార్ ల ఏసీబీ దాడులు చేసినా, కేసులు నమోదు చేసిన వెనుక పెద్ద తదంగమే ఉంటుందని అన్నారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఈ వ్యవహారం వెనుక కథ నడిపించే వారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని అంటున్నారని, కానీ.. టీడీపీ హయంలోనూ అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పడమటి రిజిస్ట్రార్ చైతన్య మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన ఏసీబీ ఎందుకు ఆగిపోయిందని తెలిపారు. అందుకు కారణంగా.. ఓ ఐపీఎస్ అధికారి అని వెల్లడించారు. అసలు అక్కడ పోస్టింగ్ వ్యవహారమే పెద్ద కుట్ర అని తేల్చారు. గతంలో ఆ స్థానంలో పని చేసిన రాఘవరావును తొలగించి.. అక్కడ చైతన్యకు పోస్టింగ్ ఇచ్చేందుకు రాఘవరావుపై ఏసీబీ రైడింగ్ జరిపినట్లు సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం టీడీపీ హయాంలో జరిగినట్లు తెలిపారు.
వారి ఆస్తి తరాలు తిన్నా తరగదు..
రిజిస్ట్రార్ అధికారులతో తనకున్న సంబంధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చీమకుర్తి శ్రీకాంత్.. వారికి సంబంధించిన అనేక విషయాలపై సంచలన విషయాలు వెల్లడించారు. ధర్మా సింగ్, రామారావు బిజినెస్ పార్టనర్లు అని తెలిపారు. వ్యాపారాల్లో సమస్యల కారణంగానే.. వారిద్దరు బయటపడ్డారని తెలిపారు. వారిద్దరి ఆస్తులు భారీగా పోగయ్యాయని తెలిపిన చీమకుర్తి శ్రీకాంత్.. తరాలు తిన్నా తరిగిపోని ఆస్తులు సంపాదించారని అన్నారు. ధర్మా సింగ్ ఆస్తి అయితే.. రోజుకు లక్ష తిన్నా కరిగిపోదని, రామారావు ఆ స్థాయిని ఎప్పుడో దాటిపోయాడని శ్రీకాంత్ అన్నారు.
Also Read : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనస్వాగతం చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ప్రారంభమైన రోడ్ షో..
ఇక ప్రభుత్వంలోని పెద్దల పేర్లు ప్రస్తావించిన చీమకుర్తి శ్రీకాంత్.. ప్రభుత్వంలో కీలక పోస్టులు నిర్వహించిన దశథరామిరెడ్డి, కేఎన్ఆర్, ధనుంజయ్ రెడ్డి పేర్లును వెల్లడించారు. వీరు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వాళ్లపై తాను ఆరోపణలు చేస్తుంటే.. వాళ్లు ఎందుకు బయటకు వచ్చి సమాధానాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఖండించారు. దశథరామిరెడ్డి, కేఎన్ఆర్ తో తనకున్న సంబంధాలను వివరించారు.