SERP Issued Key Instructions To Volunteers: వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి సెర్ప్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్, మే నెల పింఛన్లు పంపిణీ చేసే సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆథరైజేషన్ పత్రాలను తమ వెంట తప్పనిసరిగా ఉంచుకోవాలని సర్క్యలరీ జారీ చేసింది.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేసే సమయంలో వారితో ఆథరైజేషన్ పత్రాలు ఉంచుకోవాలని సర్క్యలర్ జారీ చేసింది. ఏప్రిల్, మే నెలల్లో బ్యాంకుల నుంచి నగదు తీసుకుని వెళ్లే సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్ పత్రం తప్పనిసరి చేస్తూ తాజాగా సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారి వద్ద రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో నగదు ఉంటే పోలీసులు పట్టుకునే అవకాశం ఉందని తెలిపింది. అందుకే పింఛన్లు పంపిణీ చేసే వాలంటీర్లకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయితీ కార్యదర్శి, సంక్షేమ శాఖ అధికారులు ఆథరైజేషన్లు ఇవ్వాలని సెర్ప్ స్పష్టం చేసింది.
దీంతో పాటుగా పింఛన్లు పంపిణీ సమయంలో వాలంటీర్లు ఎటువంటి ప్రచారం నిర్వహించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో మాదిరిగా పింఛన్లు పంపిణీ చేసే సమయంలో వాలంటీర్లు ఎటువంటి ఫోటోలు, వీడియోలు తీయవద్దని వెల్లడించింది. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సెర్ప్ సీఈవో కార్యాలయం హెచ్చరించింది.