Tadipatri Liquor: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వెలుగుచూసిన గోవా మద్యం కేసు రాజకీయంగానూ, శాంతిభద్రతల పరంగానూ తీవ్ర కలకలం రేపుతోంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. జగన్ వ్యాఖ్యలపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించడమే కాకుండా, పోలీసుల సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
జగన్ చేసిన ఆరోపణలను తాను సీరియస్గా తీసుకుంటున్నానని తెలిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ప్రాంతంలో లారీలతో అక్రమ మద్యం రవాణా జరుగుతోందన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని డిమాండ్ చేస్తూ.. ఉదయం 10 గంటలకు తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఆయన పిలుపునిచ్చారు. దీంతో స్థానికంగా రాజకీయ వేడి పెరిగింది. అయితే, సీఐలు ఆరోహణరావు, నారాయణరెడ్డి ఆయనతో మాట్లాడి కేసు పురోగతిని వివరించారు. దర్యాప్తు జరుగుతున్న వేళ పోలీసులకు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో, సిఐల సూచన మేరకు జేసీ తన ధర్నాను విరమించుకున్నారు.
ముగ్గురి అరెస్ట్ .. విచారణ ముమ్మరం
ఈ గోవా మద్యం కేసులో పోలీసులు ఇప్పటికే రామాంజనేయులు రెడ్డి, మాధవ, లక్ష్మీకాంతరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రాథమిక విచారణలో మరికొంతమంది కీలక పాత్రధారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో లోతుగా విచారించి, తప్పు చేసిన వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక
పోలీసుల హామీతో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. కొద్ది రోజుల్లోగా సమగ్ర విచారణ పూర్తి చేసి, అక్రమ మద్యంతో సంబంధం ఉన్న అసలు నిందితుల పేర్లను బహిరంగంగా వెల్లడించకపోతే మళ్లీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు.
Also Read: వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కుల పంపిణీ.. ప్రారంభ తేదీ ప్రకటించిన సీఎం చంద్రబాబు!