TDP Cadre – GV reddy: టీడీపీ అధిష్టానంపై కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారా? ధిక్కార స్వరం వినిపించే సమయం కోసం ఎదురు చూపుల్లో ఉన్నారా? ఆ ప్రభావమే జీవీ రెడ్డి రాజీనామాతో బహిర్గతమైందా? వైసీపీ దారిలో టీడీపీ వెళ్తుందని కార్యకర్తల కామెంట్స్ వెనుక అసలు కారణం ఏమిటి? పాలన తప్ప కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలలో వాస్తవమెంత? టీడీపీలో అసలేం జరుగుతోంది? ఇలాంటి ప్రశ్నలు ఒక్కసారిగా ఏపీలో వినిపిస్తున్నాయి. ఒక్క జీవీ రెడ్డి కాదు అలాంటి వారి జాబితా పెద్దగానే ఉందని టాక్. అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే, పెను ప్రమాదమే పొంచి ఉందట. ఇంతకు టీడీపీ క్యాడర్ మనస్సులో ఏముంది? అసలేం జరుగుతుందో తెలుసుకుందాం.
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలో లేని సమయంలో వైసీపీ తన విమర్శలతో ముచ్చెమటలు పట్టించిన వారిలో జీవీ రెడ్డి ఒకరు. జీవీరెడ్డి లైన్ దాటకుండా విమర్శలు గుప్పిస్తారని, అదే ఆయనకు పార్టీలో సుస్థిర స్థానం కల్పించిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే సీఎం చంద్రబాబు కూడా జీవీరెడ్డికి ప్రాధాన్యత కల్పిస్తూ, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా నియమింపజేశారు. అలా భాధ్యతలు స్వీకరించారో లేదో ఛైర్మన్ స్థాయిలో ఆయన పూర్తి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఈ దశలో ఎండీగా ఉన్న దినేష్ ఐఏఎస్ కు జీవీ రెడ్డికి విభేధాలు వచ్చాయని టాక్. అందుకే నిరంతరం ఏపీ ఫైబర్ నెట్ వార్తల్లో నిలుస్తూ వచ్చింది.
ఆ విభేధాల కారణంగానే జీవీ రెడ్డి రాజీనామా చేశారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ ఇక్కడ అందరికీ వస్తున్న ఏకైక డౌట్ ఒక్కటేనట. ఏపీ ఫైబర్ నెట్ లో వివాదం ఉంటే, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. కానీ ఏకంగా టీడీపీ సభ్యత్వానికి కూడా జీవీ రాజీనామా చేయడమే సంచలనంగా మారింది. ఇదే టీడీపీకి పెద్ద మైనస్ అయిందని విశ్లేషకుల అభిప్రాయం. జీవీ రాజీనామా చేసిన వెంటనే వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుందని అందరూ భావించారు. కానీ ఇక్కడ అంతా వ్యతిరేకంగా సాగింది. టీడీపీకి కరడుగట్టిన సైనికులు సోషల్ మీడియాలో మంచి పని చేశారు జీవీ రెడ్డి అన్నా అంటూ మారుమ్రోగించారు. అంతేకాదు టీడీపీకి వైసీపీ గతేనంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ వెనుక పెద్ద కారణమే ఉందట.
జీవీ రెడ్డి లాంటి నిజాయితీ పరుడైన నాయకుడికి పార్టీ అండగా ఉండలేదన్నది కార్యకర్తల మనోగతం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తీరున జీవీ రాజీనామాతో అధిష్టానం అలర్ట్ అయినా అప్పటికే జరిగే నష్టం జరిగిందని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. ఎండీ దినేష్ ను బదిలీ చేసినప్పటికీ, ఇదే పని ముందే చేసి ఉంటే జీవీ రాజీనామా ఉండదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక టీడీపీ అధిష్టానం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, వైసీపీ దారిలో నడుస్తుందని పలువురు తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
Also Read: శివరాత్రి ప్రత్యేక పాట 2025.. శివుడిని ఇంత గొప్పగా ఎవరు వర్ణించగలరు!
పార్టీ క్యాడర్ పట్టించుకోకనే వైసీపీకి 11 సీట్లు దక్కాయన్న విషయాన్ని జగన్ ఆలస్యంగా గుర్తించారని, అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని లేకుంటే పెను ప్రమాదమే పొంచి ఉందన్న టాక్ నడుస్తోంది. పాలన ఒక్కటే కాదు, పార్టీని కాపాడుకోవాలని టీడీపీ అధిష్టానానికి క్యాడర్ సూచిస్తోంది. జీవీ రాజీనామా పెద్ద మైనస్ గా పేర్కొంటున్న తెలుగు తమ్ముళ్లు, ఇప్పటికైనా అధిష్టానంపై సోషల్ మీడియా వేదికగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మరి క్యాడర్ ను నచ్చజెప్పుకొనే ప్రయత్నాలు టీడీపీ అధిష్టానం చేస్తుందా? లేక సైలెంట్ గా జరిగే పరిణామాలను చూస్తూ ఉంటుందా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.