Pattabhiram: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, గంజాయి బ్యాచ్లను, రౌడీ మూకలను వెంటబెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
డీఎస్సీ వివాదం, నారా లోకేష్ సవాల్
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అనవసరంగా రచ్చ చేస్తోందని పట్టాభి విమర్శించారు. డీఎస్సీ ప్రక్రియపై చర్చకు రావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్ను స్వీకరించే ధైర్యం జగన్కు లేదని ఎద్దేవా చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారనే విషయాన్ని హైకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు.
ముత్యాలంపాడు ఘటనాక్రమం
పోలీసుల అనుమతి లేకుండా విజయవాడలోని ముత్యాలంపాడు బస్టాప్ను ఆక్రమించుకుని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో రౌడీ మూకల హడావుడిని చూసి విసిగిపోయిన ప్రజలే స్వయంగా ఎదురుతిరిగి ఆ టెంట్లను పీకేసి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా పై తిరగబడటం సరైన పద్ధతి కాదన్నారు.
Also Read: ఆ కేసులు తేలితే జీవితకాలం జైల్లోనే!.. సీనియర్ ఐఏఎస్పై హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్
పసుపు సైన్యం హెచ్చరిక
కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై గౌరవం ఉందని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ సైన్యం కలిసి వస్తే వైసీపీ నేతలు తట్టుకోలేరని హెచ్చరించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడులు చేయించి నీచ సంస్కృతికి తెరలేపారని ఆరోపించారు. దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు.
భవిష్యత్ పరిణామాలు
దేవినేని అవినాష్ చేసిన అక్రమాలకు, పాపాలకు తగిన శిక్ష పడటం ఖాయమని, ఆయనకు చిప్ప కూడు తప్పదని పట్టాభి స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో అనేక దేవాలయాలపై దాడులు జరిగినా పట్టించుకోని నేతలు ఈరోజు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఓపిక పట్టామని, ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.
Also Read: కాపు వ్యూహం ఫెయిల్.. జగన్ ప్లాన్ బి ఇదే.. అనిల్ యాదవ్తో బిగ్ గేమ్!