BC Vote Bank: రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ కొంతకాలంగా సామాజిక సమీకరణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కాపు నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ నినాదం ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రయోజనం కనిపించలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు బీసీ ఓటు బ్యాంకుపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి గెస్ట్ రోల్ రాజకీయాలు చేస్తూ వస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించే దిశగా చర్చలు జరిగాయని విశ్వసనీయ సమాచారం.
జగన్తో అనిత్ యాదవ్ భేటీ..
ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో అనిల్ కుమార్ యాదవ్ వరుసగా భేటీ అయ్యారు. తనకు నెల్లూరు జిల్లాలో ఓ నియోజకవర్గం కేటాయించాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నియోజకవర్గం కంటే ముందుగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ నాయకులు, యువతను ఏకం చేసే బాధ్యత తీసుకోవాలని జగన్ సూచించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో బీసీ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలపై కూడా పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతోందని సమాచారం
సంచలనంగా మారిన అనిల్ కుమార్ యాదవ్ పోస్టు..
ఇటీవల ఎక్స్ వేదికగా అనిల్ కుమార్ యాదవ్ చేసిన పోస్టు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. బీసీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. బీసీలు కళ్లు ఎర్ర చేస్తే కూటమి పార్టీలు బూడిదలో కలిసిపోతాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Also Read: ఓఆర్ఆర్ కాంట్రాక్టర్లపై సీఎం ఫైర్.. అధికారులకు ఆ రూల్స్ తప్పనిసరి!
వైసీపీ మైలేజీ ఇస్తుందా..?
మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ను రాష్ట్రస్థాయి బీసీ ముఖచిత్రంగా నిలబెట్టే దిశగా వైసీపీ అడుగులు వేస్తోందన్న ప్రచారం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ వ్యూహం వైసీపీ మైలేజీ ఇస్తుందా..? రాజకీయంగా ఎంత మేరకు కలిసి వస్తుంది..? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: ఆ కేసులు తేలితే జీవితకాలం జైల్లోనే!.. సీనియర్ ఐఏఎస్పై హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్