Tirumala News: దేశ విదేశాల నుండి శ్రీవారి భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా, తిరుమలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన పునరావృతం కాకుండా టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ పటిష్ట భద్రతా చర్యలను చేపట్టింది.
రథసప్తమి రోజు సుమారు 2 నుండి 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేసిన నేపథ్యంలో, అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లలో ఎక్కడ లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుమలకు వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను టీటీడీ ప్రకటించింది.
రథసప్తమిని పురస్కరించుకొని 4, 5 తేదీలలో టైం స్లాట్ టికెట్స్ టోకెన్లు జారీ చేయడాన్ని నిలుపుదల చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు. కాగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి వాహన సేవలు తిలకించేందుకు వస్తున్న సందర్భంగా.. మాడవీధుల్లోని క్యాలరీలలో జర్మన్ షెడ్డులను ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, త్రాగునీరు అందించేందుకు గ్యాలరీలలో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి సైతం అందిస్తారు. వాహన సేవలను తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను సైతం ఏర్పాటు చేశారు. అంతేకాదు ఎండలో నడిచేందుకు భక్తులు ఇబ్బంది పడకుండా పలుమార్గాలలో వైట్ పెయింట్ వేశారు.
శ్రీవారి వాహన సేవలు వివరాలు ఇవే..
ఉ. 5.30 నుండి 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 AM) – సూర్య ప్రభ వాహనం
ఉ. 9 నుండి 10 గంటల వరకు – చిన్న శేష వాహనం
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం
రథసప్తమిని పురస్కరించుకొని 1250 మంది పోలీసులు, 1,000 విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలను కొనసాగిస్తారు. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను టీటీడీ తీసుకుంది. గ్యాలరీలలోకి వచ్చే భక్తుల కొరకు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలతో పాటు అత్యవసర మార్గాలను సైతం ఏర్పాటు చేశారు. టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.
Also Read: Sonu Sood: ఏపీకి సోనూ సూద్ సాయం..
భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణీలో ఎన్.డి.ఆర్.ఎఫ్, గజ ఈతగాళ్ల ఏర్పాటు చేశారు. మాడవీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ సాగనుంది. భక్తులకు అవసరమైన 8 లక్షల లడ్డూల తయారీ పూర్తి చేయగా, ఎక్కడ కూడ శ్రీవారి లడ్డూ ప్రసాదం కొరత లేకుండా ముందుగానే టీటీడీ చర్యలు తీసుకుంది. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు దాదాపు 2500 మంది శ్రీవారి సేవకుల సేవలు అందనున్నాయి. ఇలా టీటీడీ అన్నీ చర్యలు చేపట్టగా, భక్తులు కూడ సిబ్బందికి సహకరించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావులు కోరారు.