Tidco Houses: గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అవకతవకలకు పాల్పడిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆరోపించారు. వచ్చే జూన్ నెలాఖరు లోపు టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పరిస్థితి, లబ్దిదారులకు ఇళ్ల అప్పగింతపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. 2014-2019లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి 7,01,481 ఇళ్లను కేటాయించిందన్నారు. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు జారీ చేయడంతో పాటు టెండర్లు కూడా పిలిచి పనులు ప్రారంభించామన్నారు.
గత ప్రభుత్వం ఈ 5 లక్షల ఇళ్లను 2,61,640 కు తగ్గించేసింది. మొత్తంగా 4,39,841 ఇళ్లను రద్దు చేసేసిందన్నారు. ఈ ఇళ్లను కూడా పూర్తిచేయలేదు. అత్యాధునిక షీర్ వాల్ టెక్నాలజీతో ఇంటి సామాగ్రి కూడా అత్యాధునికమైన నాణ్యమైనది వాడేలా అన్ని వసతులు, పార్కులు, డ్రెయిన్లు, కమ్యూనిటీ హాళ్లు, హాస్పిటల్ వంటివి కూడా నిర్మించేలా డిజైన్ చేశాం. కానీ గత ప్రభుత్వం వాటన్నింటినీ నాశనం చేసింది. 2019 మే నాటికి 77,350 ఇళ్లను 90 నుంచి 100 శాతం పూర్తిచేశాం. కానీ గత ప్రభుత్వం ఇళ్లను పూర్తి చేసినా ఎక్కడా మౌలిక వసతులు మాత్రం కల్పించలేదన్నారు మంత్రి నారాయణ.
‘103 యూఎల్బీలలో పనులు ప్రారంభిస్తే గత ప్రభుత్వం 88 యూఎల్బీలకు పరిమితం చేసి 15 వేల ఇళ్లను పూర్తిగా తొలగించేసింది. కేవలం 1,77,546 ఇళ్లు పూర్తి కాగా 84,094 ఇళ్లు నిర్మాణం జరుగుతున్నాయి. గత ప్రభుత్వం నిధుల విషయంలో కూడా జీవోలు ఇచ్చింది తప్ప, డబ్బులు ఇవ్వలేదు. లబ్దిదారుల వాటా తగ్గించామని చెప్పి జీవోలు ఇచ్చారు తప్ప నిధులు ఎక్కడా విడుదల చేయలేదు. కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన రూ.3100 కోట్లు ఇవ్వలేదు.
మిగిలిన ఇళ్లు,ఇన్ ఫ్రా కోసం 3302 కోట్లు అవసరం. మొత్తంగా ప్రాజెక్ట్ పూర్తికి 7280 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి హడ్కో నుంచి 4450 కోట్లు రుణం తీసుకుంటున్నాం. లబ్దిదారులకు ఇచ్చే ఇళ్ల మీద రుణాలు రూ.1725 కోట్లు తీసుకుంటున్నాం. అమృత్ పథకం నిధులు రూ.225 కోట్లు ఖర్చు పెట్టేలా మొత్తం ప్రాజెక్ట్ డిజైన్ చేశాం. మరో రూ.818 కోట్లు వివిధ రూపాల్లో తీసుకునే ఆలోచనలో ఉన్నాం’- మంత్రి నారాయణ
Also Read: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?
2014-19 లో ఎంపిక చేసిన లబ్దిదారుల్లో 52,192 మందిని అనర్హులుగా ప్రకటించి వారికి ఇళ్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇళ్లు నిర్మించకుండానే లబ్దిదారుల పేరు మీద లోన్ లు తీసుకుందని మంత్రి చెప్పారు. దీంతో బ్యాంకుల నుంచి లబ్దిదారులకు ఒత్తిడి రావడంతో రూ.140 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించింది. ఇళ్లకు అప్పటికే రంగులు వేసినప్పటికీ గత ప్రభుత్వం పార్టీ రంగులు వేసుకుందని, దీనికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వలేదన్నారు.
ఇక ప్రతినెలా కట్టాల్సిన 6 కోట్ల రూపాయిలను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మొత్తంగా వచ్చే జూన్ నాటికి 2,61,640 ఇళ్లను పూర్తి చేసి అన్ని మౌళిక వసతులు కల్పించేలా ముందుకెళ్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈలోగా ఇళ్లు పూర్తయ్యే చోట ప్రతి శనివారం లబ్దిదారులకు ఇళ్లు కేటాయించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నారాయణ చెప్పారు.