Sri Vari Kalyanam : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో.. కోట్ల మంది భక్తుల ఆరాధ్య ధైవం, తెలుగు రాష్ట్రాల ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించునున్నారు. స్వామి వారి సేవలో రాజధాని పరిసర ప్రాంతాల ప్రజల్ని భాగస్వాముల్ని చేసేందుకు, ఇక్కడ వేటపాలెం ఆలయంలో వేడుకగా కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15న వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణం లో జరుగనున్న శ్రీనివాస కల్యాణానికి సంబంధించిన పనుల పురోగతిని టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. చేపట్టాల్సిన పనులు, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ తో పాటుగా సమీక్ష నిర్వహించారు.
కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి కళ్యాణం అంటే రెండు కళ్లు సరిపోవు. ఆయనను చూసేందుకు, ఆ వైభోగాన్ని ఆనందించేందుకు కోట్ల మంది హిందువులు వస్తుంటారు. ఆ స్వామి వారి ఆలయాల్ని మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న టీటీడీ.. అమరావతిలోని వేటపాలెంలోని వెంకటేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది. పైగా..ఇక్కడ మార్చి15న పెద్ద ఎత్తున స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ముహుర్తం దగ్గర పడుతుండడంతో.. ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష నిర్వహించారు. కళ్యాణానికి సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం టీటీడీ అధికారులు, గుంటూరు జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలసి ఆయన సమన్వయం సమావేశం నిర్వహించారు.
శ్రీనివాస కల్యాణంపై వెంకటపాలెం సమీపంలోని గ్రామాల్లో టీటీడీ ప్రచారం రథం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఈవో సూచించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా కల్యాణ వేదిక పరిసరాలలో అవసరమైన గ్యాలరీలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయం, కల్యాణ వేదిక పరిసరాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు చేపట్టాలన్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయానికి విచ్చేసి భక్తులు సులభంగా స్వామివారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసి వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసేలా.. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సూచనలు చేయాలని కోరారు.
కల్యాణానికి భజన బృందాలు , శ్రీవారి సేవకులను పెద్ద ఎత్తున ఆహ్వానించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. జిల్లా, టీటీడీ అధికారుల కోసం ప్రత్యేకంగా జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సులువుగా.. కళ్యాణ వేదిక దగ్గరకు వచ్చేందుకు వీలుగా తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వామివారి కళ్యాణాన్ని నేరుగా చూడలేని లక్షలాది మంది భక్తుల సౌలభ్యం కొరకు శ్రీనివాస కల్యాణాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. వేదిక పరిసరాలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read : Tirumala News: తిరుమలలో ఈ-కేవైసీ? శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం.. పుష్కరిణిలో విహారం
కళ్యాణ ప్రాంగణంతో పాటుగా చుట్టు పక్కల ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా.. తక్షణం స్పందించేలా విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధం చేయాలని సూచించారు. భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, సిబ్బంది, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సాయంత్రం 4 గంటలనుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా హెచ్ డీపీపీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులతో కలసి కల్యాణ వేదిక, తదితర పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.