Tirumala News: తిరుమల శ్రీవారి దర్శనం గురించి చెప్పనక్కర్లేదు. వరుసగా సెలవులు వస్తే చాలు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తహతహలాడుతారు. నిత్యం వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అయితే శనివారం ఉదయం శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో గందరగోళం నెలకొనడంతో నిరసనకు దిగారు భక్తులు. అసలు అక్కడ ఏం జరిగింది?
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల కోసం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శన టికెట్లను విక్రయాలు చేస్తోంది టీటీడీ. ఒకప్పుడు శ్రీవాణి టికెట్లను ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేవారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారాయి. ఏ రోజుకు ఆ రోజే ఆయా టికెట్లను విక్రయం చేస్తున్నారు.
ఇదిలాఉండగా శనివారం ఉదయం టికెట్ల జారీలో గందరగోళం నెలకొంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆయా టికెట్లను జారీ చేస్తామని ముందుగా ప్రకటించింది టీటీడీ. అయితే శుక్రవారంతోపాటు వీకెండ్ సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. తక్కువ సమయం ఉండడంతో శ్రీవారి టికెట్ల కోసం భారీగా భక్తులు తరలివచ్చారు.
వారిని కంట్రోల్ చేయలేక శుక్రవారం అర్ధరాత్రి నుంచే టికెట్ల విక్రయాలు మొదలుపెట్టారు టీటీడీ అధికారులు. ఈ క్రమంలో రాత్రి తోపులాట చోటుచేసుకుంది. రాత్రి టికెట్లు ఇచ్చిన విషయం తెలియక శనివారం ఉదయం శ్రీవాణి టికెట్ విక్రయం కేంద్రానికి భక్తులు వచ్చారు. రాత్రి టికెట్లు ఇచ్చామని చెప్పడంతో భక్తులు షాకయ్యారు.
ALSO READ: అంబటి చిక్కు ప్రశ్న.. మంత్రి లోకేష్ ఎలా రియాక్ట్ అవుతారో?
టికెట్లు దొరక్కపోవడంతో అన్నమయ్య భవనం ఎదుట నిరసనకు దిగారు భక్తులు. ఈ విషయం తెలియగానే విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపించారు. కొత్తగా తీసుకొచ్చిన నిర్ణయం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.
వరుసగా సెలవులు రావడంతో భక్తులతో తిరుమల ఏడు కొండలు కిక్కిరిశాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో దర్శనం మరింత ఆలస్యం కావచ్చని అంటున్నారు. వైకుంఠం-2, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు భక్తుల క్యూలైన్ ఉంది. వరుస సెలవులు రావడంత అమాంతంగా రద్దీ పెరిగింది. వచ్చేవారం కూడా ఇలా ఉండవచ్చని అంటున్నారు.