Tirumala Update: తిరుమల శ్రీవారి దర్శనార్థం మార్చి నెలలో వెళుతున్నారా.. అయితే ఈ సమాచారం తప్పక తెలుసుకోండి. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ తాజాగా కీలక ప్రకటన చేసింది. మార్చి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయాలలో జరిగే విశేష ఉత్సవాల గురించి టీటీడీ ముందుగానే ప్రకటన జారీ చేసింది. ఈ సమాచారం భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని, శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.
మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలివే..
మార్చి 9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం, 10న మతత్రయ ఏకాదశి, 13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి, 14న కుమారధారతీర్థ ముక్కోటి, 25న సర్వ ఏకాదశి, 26న అన్నమాచార్య వర్థంతి, 28న మాస శివరాత్రి, 29న సర్వ అమావాస్య, 30న శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి మార్చి నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. మార్చి 4న మంగళ వారం ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ, మార్చి 7, 14, 21, 28వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం, మార్చి 12న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం, మార్చి 25న శ్రవణా నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం జరగనున్నాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో మార్చి నెలలో జరిగే విశేష ఉత్సవాలివే.. మార్చి 7, 14, 21, 28వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. మార్చి 24న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. మార్చి 30న ఉగాది సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పుష్ప పల్లకీపై ఆలయ మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో మార్చి 2న శ్రీ సుందరరాజ స్వామివారు సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో.. మార్చి 6న శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో.. మార్చి 16న శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
Also Read: Flax Seeds: అవిసె గింజలతో.. అద్భుత ప్రయోజనాలు !
మార్చి 9 నుండి 13వ తేది వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తెప్పోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 9న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 10న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. మూడవరోజు మార్చి 11న శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 12న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 13వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల మధ్య తెప్పోత్సవాలు జరగనున్నాయి.
ఆర్జిత సేవలు రద్దు
తెప్పోత్సవాల కారణంగా మార్చి 09, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఈఈలు శ్రీ సుబ్రమణ్యం, శ్రీ సుధాకర్, శ్రీ వేణుగోపాల్, డీఈ శ్రీ చంద్ర శేఖర్, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.