Tirumala Robotic Dog: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల భద్రతతో పాటు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకునే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా తిరుమల మెట్ల మార్గాల్లో చిరుతపులుల సంచారం పెరగడం, భక్తులపై దాడులు జరుగుతుండటంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తులు కాలినడకన తిరుమలకు వెళ్లే మార్గాల్లో రోబోటిక్ డాగ్ తో గస్తీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన రోబోటిక్ డాగ్ ను.. గురువారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద పరిశీలించారు. టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఇతర ఉన్నతాధికారులతో కలిసి రోబో డాగ్ పనితీరును పర్యవేక్షించారు. మనుషులు వెళ్లడానికి వీలులేని సంక్లిష్టమైన, ప్రమాదకరమైన అటవీ ప్రాంతాల్లో నిఘా కోసం ఈ రోబో ఏమేరకు ఉపయోగపడుతుందనే అంశాన్ని ప్రతినిధి బృందం నిశితంగా తనిఖీ చేసింది. దాని ప్రతిభను చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
@TTDevasthanams Explores Robotic Dog for Wildlife Monitoring & Devotee Safety
Equipped with AI, thermal & optical cameras, LiDAR and sensors, the robot can detect wildlife in darkness/fog, send geo-tagged alerts & stream live feeds to control rooms#TTD #Tirumala #DevoteeSafety pic.twitter.com/GM0bTBt1xW— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 20, 2026
ఈ అత్యాధునిక రోబోటిక్ డాగ్.. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందింది. దీనికి అమర్చిన ఆప్టికల్, థర్మల్ కెమెరాలు.. చీకటి, దట్టమైన పొగమంచు పరిస్థితుల్లోనూ జంతువుల కదలకిలను ఈజీగా గుర్తించగలవు. అంతేకాకుండా ఇది రాత్రి వేళల్లో చుట్టుపక్కల వాతావరణాన్ 360 డిగ్రీల పూర్తిగా మ్యాపింగ్ చేయగలదు. దీనికి అందించిన ఏఐ టెక్నాలజీ ఆధారంగా .. వన్యప్రాణులు, మనుషులు, వాహనాలు, పెంపుడు జంతువుల మధ్య తేడాను ఈ రోబోటిక్ డాగ్ ఎంతో తెలిగ్గా గుర్తించగలదని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ రోబోటిక్ డాగ్.. వన్యప్రాణుల కదలికలను గుర్తించిన వెంటనే అలర్టులతో పాటు లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్ను నేరుగా కంట్రోల్ రూమ్కు చేరవేస్తుంది. అదే సమయంలో సమీపంలోని పెట్రోలింగ్ సిబ్బందికి సైతం జంతువుల కదలికలకు సంబంధించిన డేటాను పంపిస్తుంది. దీనివల్ల భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. భక్తులను హెచ్చరించేందుకు వీలు కలుగనుంది.
జంతువులను గుర్తించి.. వాటిని తరిమేసేలా ఈ రోబోటిక్ డాగ్ ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. వన్యప్రాణులకు హాని తలపెట్టకుండా, మనుషులతో నేరుగా ఎదురుపడే పరిస్థితి రాకుండా చూసేందుకు ఈ రోబోలో ప్రత్యేక సౌండ్, లైటింగ్ వ్యవస్థలను అమర్చారు. ఈ రోబోట్ వన్యప్రాణులు కనిపించిన వెంటనే వింత శబ్దాలు, విభిన్నమైన లైటింగ్స్ తో వాటిని భయపెట్టి.. తిరిగి అడవిలోకి పంపించేందుకు వీలు కలుగనుంది.
ఈ రోబోటిక్ డాగ్ ను పైలెట్ ప్రాజెక్ట్ కింద అలిపిరి – తిరుమల కాలినడక మార్గంలో ప్రయోగించనున్నారు. మెట్లమార్గానికి అనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో ఈ రోబో సేవలను వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. చిరుతలు, ఇతర క్రూర మృగాలు సంచరించేటప్పుడు ఇది గుర్తించి.. సిబ్బందికి ఎంత వేగంగా సమాచారం చేరవేస్తుందన్నది ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. దీని ఫలితాలను బట్టే భవిష్యత్తులో మరిన్ని రోబోటిక్ డాగ్స్ సేవలను తిరుమలలో వినియోగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read: దేశంలో విచిత్రమైన ఊర్లు.. బండ బూతులే వీటి పేర్లు.. అలా ఎలా పెట్టార్రా అయ్యా!
అయితే రోబోటిక్ డాగ్ ప్రస్తుతం టీటీడీ అవలంభిస్తున్న భద్రతా విధానాలకు పూర్తి ప్రత్యామ్నాయం కాదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం వన్యప్రాణులను గుర్తించేందుకు అవలంభిస్తున్న కెమెరా ట్రాప్లు, కాలినడక పెట్రోలింగ్, ఫారెస్ట్ గార్డుల వ్యవస్థ యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. వారికి అదనపు బలంగా మాత్రమే ఈ రోబోటిక్ డాగ్ మారనుందని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో సెక్యూరిటీ టీమ్స్ పెట్రోలింగ్ సమయాన్ని సరిగ్గా ప్రణాళిక చేసుకోవడానికి ఈ రోబో సాయపడుతుందని చెప్పుకొచ్చారు.
Also Read: కారు డిక్కీలో మహిళ మృతదేహం.. షాకైన స్థానికులు, రంగంలోకి పోలీసులు, హనుమకొండ జిల్లాలో ఘటన