Union Minister Kumaraswamy on Vizag Steel Plant(AP latest news): విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడం మా బాధ్యత అని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై అనేక కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయని, ప్లాంట్ మూత పడుతుందనే ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. ఎంతోమందికి బతుకునిచ్చే ఇలాంటి ప్లాంట్లను రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో వందశాతం సామర్థ్యంలో ఉత్పత్తి జరుగుతుందని మంత్రి కుమార స్వామి తెలిపారు. అంతకుముందు విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ భాగాలను పరిశీలించారు. అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కొంతమంది కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
కేంద్రమంత్రి కుమార స్వామి గురువారం ఉదయం విశాఖకు చేరుకున్న అనంతరం సహాయ మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి ప్లాంట్ ఆద్యంతం పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ పేరు ఎత్తకుండానే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ సందర్శించిన తర్వాత నాకు ఈ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందన్నారు.
Also Read: గత పాలకులు వీరప్పన్ వారసులు.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా, ఇటీవల కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్పై ఇప్పట్లో ముందుకెళ్లడం లేదని అన్నారు. అయితే తాజాగా, కుమారస్వామి ఆందోళన అవసరం లేదని చెప్పడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం తగు సమయంలో నిర్ణయాలు తీసుకుంటుందని ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న సంఘటనలు, పరిణామాలు.. కార్మికులు, ఉద్యోగాల్లో భరోసా నింపుతున్నాయి.