ED Raids: వైసీపీకి కొత్త కష్టాలు మొదలయ్యాయా? వైఎస్ వివేకానంద కేసు కొత్త మలుపు తిరిగిందా? ఈ కేసులోకి ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఎంటరైందా? శుక్రవారం ఉదయం నుంచి వైసీపీ ఎంపీ అవినాష్ ఇళ్లు సహా పలు చోట్లు ఏపీ-తెలంగాణల్లో సోదాలు చేపట్టింది ఈడీ. ఈ విషయం తెలియగానే వైసీపీ పెద్దల్లో ఒక్కసారి టెన్షన్ మొదలైంది.
వైఎస్ వివేకానంద హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కోట్లాది రూపాయిలు చేతులు మారాయని ఆరోపణల నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం నుంచి వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఏపీ-తెలంగాణల్లో మొత్తం ఆరు చోట్ల సోదాలు చేస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్, కడపతోపాటు మరో నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోకాపేట్లోని ఓపెన్ స్కైస్లోని ఎంపీ అవినాష్రెడ్డి నివాసం, అలాగే పులివెందుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో బయట ఉన్నారు ఈడీ అధికారులు. ఎంపీ ఇళ్లతోపాటు నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి.
సీబీఐ కేసు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఈడీ. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం, మనీలాండరింగ్ వంటి ఆంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. వివేకా హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకు రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తోంది ఈడీ. అంతేకాదు సీబీఐ దర్యాప్తు సమయంలో బయటకు వచ్చిన అంశాలపై మరింత లోతుగా విచారణకు చేపడుతోంది.
ALSO READ: ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నిందితులకు ఇచ్చిన నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎవరు ఇచ్చారు? అనేదానిపై ఫోకస్ చేసింది ఈడీ. ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగిన విషయం తెలియగానే వైసీపీ కీలక నేతల్లో వణుకు మొదలైంది. దాదాపు అంతా అయిపోయిందని భావించిన తరుణంలో ఈడీ దిగడం వెనుక ఏం జరిగింది? అనేదానిపై ఆ పార్టీ చర్చ మొదలైంది. ఈ కేసులో ఎవర్నైనా ఈడీ అరెస్ట్ చేస్తే.. కనీసం ఏడాది వరకు బెయిల్ రాకపోవచ్చని అనుకుంటున్నారు. మరి ఈడీల సోదాల్లో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. కొత్త విషయాలు ఏమైనా బయటకు వస్తే.. సీబీఐ మళ్లీ దర్యాప్తు చేసే అవకాశముందన్న వార్తలు లేకపోలేదు.