Kodumur Political news: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ సెగ్మెంట్లో పోటీ రసవత్తరంగా మారిందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో అక్కడ.. త్రిముఖ పోరు తప్పదనే వాదనలు ఉన్నాయి. అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని నిరాశలో ఉన్న ప్రజలు.. అటు వైసీపీ.. ఇటు కూటమిలో ఎవరివైపు చూస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోడుమూరు నియోజకవర్గానికి జాతీయస్థాయిలో పేరుంది.
నియోజకవర్గంలో బడా నేతలు ఉన్నా.. ఆశించిన స్థాయిలో మాత్రం అభివృద్ధి జరగలేదనేది అక్కడ ప్రజల మాటగా తెలుస్తోంది. మిగిలిన స్థానాలతో పోల్చితే కోడుమూరులో నేతలు. అభివృద్ధి వైపు చూడకుండా రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యారనే అపవాదు ఉందట. ప్రస్తుతం ఈ నియోజకవర్గం వైపు ప్రధానపార్టీలు చూస్తున్నాయి. ఎలాగైనా కోడుమూరులో జెండా ఎగుర వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేయటంతో అక్కడ పోటీ రసవత్తరంగా సాగనుందని రాజకీయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు, సి.బేళగల్, గూడూరు,కర్నూలు రూరల్ మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 2 లక్షల 42వేల 767 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయమని స్థానికులు చెబుతున్నారు. కోడుమూరులో మొదటి నుంచి కాంగ్రెస్ హవా నడిచింది. తర్వాత వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. తర్వాత కాలంలో కోడుమూరు వైసీపీ వశం అయ్యిందట.
Also Read: EC Notices to Sharmila : వివేకా హత్యకేసులో వ్యాఖ్యలు.. షర్మిలకు ఈసీ నోటీసులు
ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 8 సార్లు,టీడీపీ ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. ఇటీవల రెండుసార్లు వైసీపీ ఈ స్థానంలో విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కోడుమూరు YCP ఎమ్మెల్యేగా మణిగాంధీ ఎన్నికవగా. 2019 ఎన్నికల్లో జరదొడ్డి సుధాకర్.. వైసీపీ నుంచి గెలిచారు. రాబోయే ఎన్నికల్లో సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, మణిగాంధీ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇద్దరికీ మొండిచేయి చూపించిన వైసీపీ అధిష్టానం.. ఆ స్థానాన్ని డాక్టర్ ఆదిమూలపు సతీష్కు కేటాయించింది. ఊహించని ఘటనతో వైసీపీ నేతలు సహా నియోజకవర్గ ప్రజలూ ఆశ్చర్యానికి గురయ్యారు.
అక్కడ నుంచే అసలైన్ అసలు సీన్ మొదలైందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ప్రస్తుత ఎన్నికల్లో సైలెంట్గా ఉన్నారట. అయితే.. ఆయన అనుచరులు, నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాత్రం కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి పంచన చేరారట. మరో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ.. కాంగ్రెస్ పార్టీలో చేరి. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు.
Also Read: ఈసీ ఆదేశాలు, వెంకట్రామిరెడ్డిపై వేటు, ఏం జరిగింది?
మరో మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ అసంతృప్తిగా ఉండి ఎన్నికల ప్రచారంలో ఆసక్తి కనబరచటం లేదనే ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. YCPలోని ఒకవర్గం. ఆదిములపు సతీష్ నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తోందట. దానికి తోడు సతీష్కు అక్కడ ఎక్కువ పరిచయాలు కూడా లేవని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నికల ముందు కోడుమూరు నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చి తన సోదరుడు ఆదిములపు సురేష్ అండదండలతో కోసీటు తెచ్చుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి కోడుమూరు సెగ్మెంట్లో ఎదురుగాలి వీచే అవకాశాలు లేకపోలేదని వార్తలు గుప్పుమంటున్నాయి.
కోడుమూరు టీడీపీ అభ్యర్థిగా కర్నూలు మండలం పసుపుల గ్రామానికి చెందిన బొగ్గుల దస్తగిరి బరిలో ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉందట. దానికి తోడు కొందరు బంధువులు కూడా ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీకి అన్ని కలసి వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారట. కోడుమూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకూ పాలకులు ఎన్నికల్లో హామీలివ్వడం.. గెలిచిన తర్వాత మొహం చాటేయటం పరిపాటిగా మారిందని తమ నియోజక వర్గంలో అభివృద్ధి ఏదని ప్రజలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. డెవలప్మెంట్ మాట దేవుడెరుగు. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తమ సమస్యలను ఎవరు పరిష్కరిస్తామని హామీ ఇస్తారో వారికే ఓటు వేస్తామని అక్కడ ప్రజలు చెబుతున్నారట. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో రాజకీయపార్టీలు పడ్డాయని టాక్.
Also Read: YSRPC compare BRS: గంటా సంకేతాలు, ఎన్నికల తర్వాత అదే పరిస్థితి
కాంగ్రెస్ అభ్యర్ధి మురళీకృష్ణ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే పార్టీ నుంచి ఎమ్మెల్యే రేసులో ఉన్నారు. మురళీకృష్ణ పోటీతో వైసీపి అభ్యర్థికి ముప్పు తప్పదని.. అక్కడ వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోడుమూరులో రెండు సార్లు జెండా ఎగురవేసిన వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందో.. లేక అభివృద్ధి మంత్రంతో ముందుకొస్తున్న కూటమిని జనం ఆదరిస్తారో చూడాలి. మరోవైపు మాతోనే అభివృద్ధి అంటున్న కాంగ్రెస్ కూడా రేసులో ఉండటంతో అక్కడ త్రిముఖపోరు ఖాయంగా కనిపిస్తోంది.