YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. వాటికి సంబంధించిన అనేక ఆధారాలను ప్రజల ముందుంచారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బాధ్యతల అప్పగింతలోనే స్కామ్ బీజం
డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించడంపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. SCERT డైరెక్టర్, డీఎస్సీ కన్వీనర్ బాధ్యతలను ఒక్కరికే ఇవ్వడం వల్ల పారదర్శకత లోపించి, పేపర్ లీకేజీకి మార్గం సుగమమైందని విమర్శించారు. వ్యవస్థలో ఉండాల్సిన కనీస నియంత్రణలను (Checks and Balances) తొలగించి, ఉద్దేశపూర్వకంగానే ఈ తప్పు చేశారని ఆయన ఆరోపించారు.
ఫస్ట్ ర్యాంకర్ వివాదం & సీబీఐ డిమాండ్
ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి ‘నవీన్’కు ఫస్ట్ ర్యాంక్ రావడం వెనుక ఉన్న అసలు సత్యాన్ని జగన్ ప్రశ్నించారు. మొదటి మెరిట్ లిస్ట్లో ఉన్న నవీన్ పేరును, ఆ తర్వాత తొలగించి రెండో జాబితాను ఎందుకు విడుదల చేశారో చెప్పాలన్నారు. అభ్యర్థి ఐడీని ముందే బ్లాక్ చేసి, కాల్ లెటర్ పంపకుండా, సర్టిఫికేట్ల పరిశీలనకు రాలేదని సాకులు చెప్పడం లీకేజీని కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని మండిపడ్డారు. దీనిపై నిష్పాక్షిక విచారణ జరగాలంటే సీబీఐ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.
స్పోర్ట్స్ కోటా జీవోలు.. అక్రమాలు
డీఎస్సీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా కనీసం పరీక్ష కూడా రాయకుండానే స్పోర్ట్స్ కోటా కింద 372 మందికి పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి పీవీ సింధు వంటి అంతర్జాతీయ క్రీడాకారిణి పేరును వాడుకోవడం దారుణమన్నారు. తమ అనుకూల వర్గాలకు ఉద్యోగాలు అమ్ముకోవడానికే జీవో 4, జీవో 47 తెచ్చారని, పని పూర్తయ్యాక వాటిని రద్దు చేస్తూ జీవో 25, జీవో 56 ఇచ్చారని విమర్శించారు.
శాసనసభలో చర్చకు ప్రభుత్వం నైతిక భయం
ఈ ఆరోపణలు, ఆధారాల నుంచి తప్పుకోవడానికే ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా సభను నడుపుతోందని జగన్ ఎద్దేవా చేశారు. శాసనమండలిలో తమ ఎమ్మెల్సీలు నాలుగు రోజుల పాటు నిరసన తెలిపినా చర్చకు ముందుకు రాలేదని అన్నారు. ప్రతిపక్షం లేని సభలో బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీకొడుకులు మాత్రమే బ్యాటింగ్ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ALSO READ: పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లెటర్!