YS Sharmila : వైఎస్ షర్మిల. అన్నతో తీవ్ర విభేదాలు. ఆస్తుల గొడవ. రాజకీయ రచ్చ. జగన్ వదిలిన బాణం తిరిగి ఆయనకే గుచ్చుకుంది. చెల్లి చేసిన డ్యామేజ్ మామూలుగా లేదు. ఇంటి గుట్టు రోడ్డుకెక్కడంతో వైసీపీ అధినేత పరువంతా పోయింది. హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉంటూ.. జగన్కు వ్యతిరేకంగా పావులు కదిపారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో తెలంగాణలో రాజకీయం నెరిపారు. ఎన్నికలకు ముందు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి.. ఏపీలో అన్నతో తాడోపేడో తేల్చుకునేందుకు సై అన్నారు. వివేకా హత్య కేసులో సునీతకు సపోర్ట్గా నిలిచారు. షర్మిల ధిక్కారాన్ని జగన్ మొదటి నుంచీ తట్టుకోలేక పోయారు. తనకు వ్యతిరేకంగా షర్మిల ఏం ప్లాన్ చేస్తోందో తెలుసుకోవాలని అనుకున్నారు. ఏం చేయాలా? అని ఆలోచిస్తే.. జగన్కు ఓ సూపర్ ఐడియా వచ్చిందట. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు మిత్రుడేగా. ఆయనకో మాట చెబితే పోలా. అంతా ఆయనే చూసుకుంటారుగా అని అనుకున్నారట. మిత్రుడు జగన్ కోరిక మేరకు కేసీఆర్ చేసి పెట్టిన సాయం.. ‘షర్మిల ఫోన్ ట్యాపింగ్’ అని అంటున్నారు. లేటెస్ట్గా వైఎస్ షర్మిల చేసిన స్టేట్మెంట్ ఆనాడు జరిగిన కుట్రలను బయటపెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కలకలం రేపుతోంది.
షర్మిల ఏమన్నారంటే..
ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉంది. ఇన్నాళ్లూ అమెరికాలో దాక్కున్న కింగ్ పిన్ ప్రభాకర్రావును ఇండియాకు రప్పించి పలు దఫాలుగా విచారించారు. రేపో మాపో అసలు నిజాలు, తెరవెనుకు ఉన్న పెద్దలు బయటకు వస్తాయని అంటున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను సైతం ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించింది సిట్. ఆనాటి బాధితులను వరుసగా ప్రశ్నిస్తోంది. ఇలాంటి టైమ్లో సంచలన ఆరోపణలతో ముందుకొచ్చారు షర్మిల. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెబుతున్నారు. తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు ట్యాప్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే విషయం.. వైఎస్ కుటుంబంపై అభిమానం ఉన్న ఓ సీనియర్ పోలీస్ అధికారే స్వయంగా షర్మిలకు ఆ మేటర్ లీక్ చేశారని అంటున్నారు. అలర్ట్ అయిన షర్మిల.. తన వ్యక్తిగత ఫోన్లను వెంటనే మార్చేశారని.. ఎవరికీ తెలీకుండా కొత్త నెంబర్లు, కొత్త ఫోన్లను వాడే వారని చెబుతున్నారు.
Also Read : కేసీఆర్ను ఏపీ సర్కారు అరెస్ట్ చేస్తుందా?
జగన్ కోసమేనా..?
షర్మిల ఫోన్లు ట్యాప్ చేసి.. ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు జగన్కు చేరవేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కోరిక మేరకే.. అప్పటి సర్కారు షర్మిలపై నిఘా పెట్టించిందని తెలుస్తోంది. షర్మిల ఫోన్లు ట్యాప్ చేసే టాస్క్ను ప్రభాకర్రావు పర్యవేక్షించే వారని అంటున్నారు. షర్మిలపై స్పై చేయడానికి ప్రత్యేకంగా కోడ్ లాంగ్వేజ్ కూడా వాడినట్టు చెబుతున్నారు. అందుకే, ఫోన్ ట్యాపింగ్ కేసులో షర్మిల దగ్గర కీలక సమాచారం ఉందని సిట్ భావిస్తోందట. త్వరలోనే ఆమెను సైతం బాధితురాలిగా పిలిచి వివరాలు సేకరించే అవకాశం ఉందని సమాచారం.