YSRCP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ బృహత్తర కార్యక్రమంలో సేకరించిన కోట్లాది సంతకాల పత్రాలను మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందన ప్రభుత్వ నిర్ణయంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో సంతకాల పత్రాలను తాడేపల్లికి తీసుకొచ్చారు. ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ పత్రాలను పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జికి అధికారికంగా అందజేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయవద్దని తాము పిలుపునివ్వగానే.. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని నేతలు హర్షం వ్యక్తం చేశారు. తొలుత కోటి సంతకాలు లక్ష్యంగా పెట్టుకోగా, ప్రజల మద్దతుతో అది ఏకంగా ఒక కోటి 30 లక్షలకు చేరిందని, ఇది తమ పోరాటానికి లభించిన నైతిక విజయమని వారు వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఇదే అంశంపై ఢిల్లీ వేదికగానూ వైసీపీ పోరు ఉధృతం చేసింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టారు. పేదలకు వైద్య విద్యను, వైద్యాన్ని దూరం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్లకార్డులు చేబూని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేకరించిన ఈ సంతకాల ప్రతులను త్వరలో రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్లే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Nara Lokesh: ఏపీలో నైపుణ్య గణనకు సహకరించండి.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో నారా లోకేష్ భేటీ