ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పటికప్పుడు క్రేజీ కార్లు విడుదల అవుతున్నాయి. ఎంట్రీ లెవల్ నుంచి లగ్జరీ కార్ల వరకు ప్రతి ఏటా బోలెడు కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే పలు కార్లు విడుదల కాగా, టాప్ బ్రాండ్లకు చెందిన 8 కొత్త హైబ్రిడ్ కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆల్ న్యూ రెనాల్ట్ డస్టర్ భారతీయ మార్కెట్ లోకి సరికొత్తగా అడుగు పెట్టబోతోంది. రెనాల్ట్ మూడు పెట్రోల్ ఇంజిన్లను తీసుకురానుంది. వాటిలో ఒకటి 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్, మరొకటి 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్. మూడవది 1.8-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్. ఇది బలమైన హైబ్రిడ్ ఇంజిన్ గా రానుంది. ఈ హైబ్రిడ్ వెర్షన్ 160 PS, 172 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. డస్టర్ రెగ్యులర్ టర్బో పెట్రోల్ వేరియంట్లు మార్చిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ పవర్ ఫుల్ హైబ్రిడ్ వెర్షన్ ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రెనాల్ట్ డస్టర్ను విడుదల చేసిన తర్వాత, నిస్సాన్ తమ మిడ్ సైజ్ SUV టెక్టన్ను కూడా మార్కెట్లోకి విడుదల కానుంది. ఇది డస్టర్ మాదిరిగానే ఉంటుంది. కానీ, నిస్సాన్ దాని స్వంత గుర్తింపు కోసం పలు మార్పులు చేసింది. టెక్టన్ నిస్సాన్ పెట్రోల్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్ను కలిగి ఉంటుంది. ఇది 1.4 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికతో 1.8-లీటర్ బలమైన హైబ్రిడ్ ఇంజిన్ను పొందుతుంది. ఈ ఇంజిన్ డస్టర్ మాదిరిగిగానే, పవర్, టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. డస్టర్ హైబ్రిడ్ తర్వాత ఈ సంవత్సరం చివర్లో టెక్టన్ హైబ్రిడ్ విడుదల కానుంది.
హోండా ఇప్పుడు హోండా సిటీ హైబ్రిడ్ను అప్ డేట్ చేసి తేలికపాటి ఫేస్లిఫ్ట్ ను తీసుకురావాలని భావిస్తోంది. ఇది చిన్న కాస్మెటిక్ మార్పులను కలిగి ఉంటుంది. 126 PS, 253 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. సిటీ హైబ్రిడ్ ఫేస్లిఫ్ట్ కూడా ఈ సంవత్సరం చివర్లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
కియా భారత మార్కెట్ కోసం సరికొత్త SUVని పరీక్షిస్తోంది. ఈ SUV సోరెంటో పేరుతో మార్కెట్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇది పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ తో అందుబాటులో ఉంటుంది. ఇది భారత మార్కెట్లో కియా ఫస్ట్ పవర్ ఫుల్ హైబ్రిడ్ మోడల్ కానుంది. అంతర్జాతీయ మోడళ్ల మాదిరిగా కాకుండా, సోరెంటో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీతో కూడిన బలమైన హైబ్రిడ్ సిస్టమ్తో జతచేయబడిన కొత్త 1.5-లీటర్ ఇంజిన్ను ఉపయోగిస్తుంది. ఈ ఏడు సీట్ల SUV 2026 తరువాత విడుదల కానుంది.
కియా ఇటీవల మార్కెట్లో కొత్త తరం సెల్టోస్ను విడుదల చేసింది. ఈ SUV ప్రస్తుతం రెండు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతోంది. కియా త్వరలో భారత మార్కెట్లో సెల్టోస్ హైబ్రిడ్ వెర్షన్ను కూడా పరిచయం చేయనుంది. ఇది సోరెంటో SUV మాదిరిగానే 1.5-లీటర్ బలమైన హైబ్రిడ్ ఇంజిన్ను ఉపయోగిస్తుంది. సెల్టోస్ హైబ్రిడ్ 2026 చివరిలో లేదంటే 2027 ప్రారంభంలో లాంచ్ కానుంది.
హ్యుందాయ్ నెక్ట్స్ జెనరేషన్ క్రెటాను మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ SUV కియా మాదిరిగానే హైబ్రిడ్ సాంకేతికతను పొందుతుంది. హ్యుందాయ్ క్రెటా కియా సెల్టోస్ కంటే బలమైన హైబ్రిడ్ ఇంజిన్ను పొందుతుంది. హైబ్రిడ్ పవర్ట్రెయిన్ సోరెంటోలో మొదట చూసిన యూనిట్ లాగానే ఉంటుంది.
హ్యుందాయ్లో అల్కాజార్ పేరుతో 7-సీటర్ SUV ప్రస్తుతం మార్కెట్ లో సత్తా చాటుతోంది. అల్కాజార్ కూడా కియా సోరెంటో, కొత్త క్రెటా మాదిరిగా బలమైన హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ను కలిగి ఉంటుంది.
మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో ప్రసిద్ధ సెడాన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న హ్యుందాయ్ వెర్నా.. హైబ్రిడ్ వెర్షన్ లో రానుంది. ఇతర హ్యుందాయ్ మోడళ్లలో మాదిరిగా 1.5-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. కొత్త హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ప్రస్తుత వెర్నా లైనప్లో డీజిల్ ఇంజిన్ లేకపోవడాన్ని ఫిల్ చేస్తుంది.
Read Also: వామ్మో ఇదెక్కడి క్రేజ్ భయ్యా, 135 సెకెన్లలో కార్లన్నీ కొనేశారు!