గత కొద్ది సంవత్సరాలుగా ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు మధ్య తరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఈవీ కంపెనీలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాయితీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధిని మరింత పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ప్రజలకు, ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే రాయితీలను ప్రకటించే అవకాశం ఉంది.
భారతీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ బడ్జెట్ కంటే ముందు ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లను ఉంచింది. ప్రీమియం, హై ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలు స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నాయని కంపెనీ అంగీకరించినప్పటికీ, ఎంట్రీ లెవల్ EV ఫోర్ట్ ఫోలియో ఇబ్బందులు పడుతూనే ఉందని వెల్లడించింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లే లక్ష్యంగా ప్రోత్సాహకాలు పెంచి, మధ్యతరగతి వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని టాటా మోటార్స్ భావిస్తోంది. పెద్ద మొత్తంలో ఎంట్రీ లెవల్ కార్లను కొనుగోలు చేసేలా కేంద్రం సపోర్టు ఇవ్వాలని కోరింది.
ప్రస్తుతం, కేంద్రం PM E-DRIVE పథకం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ. 10,000 కోట్లను కేటాయించింది. ఈ పథకం ప్రధానంగా ఫ్లీట్, కమర్షియల్ వాహనాలపై దృష్టి పెట్టింది. ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలుదారులకు పరిమిత ప్రయోజనాలను అందిస్తుంది. బడ్జెట్ 2026లో ఈ పథకం పరిధిని వ్యక్తిగత వాహనాలను చేర్చితే, ఎలక్ట్రిక్ కార్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
ఎలక్ట్రిక్ వాహనాలను మరింత చౌకగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కీలక పాలసీలను అందిస్తుంది. మెరుగైన సబ్సిడీలతో పాటు GST తగ్గింపు లాంటి నిర్ణయాలు ధరలను తగ్గించే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు తక్కువ వడ్డీ రుణాలు ఇస్తే వినియోగదారులను పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఈవీల వైపు మొగ్గు చూపే అవకాశం కల్పించవచ్చు. EV కొనుగోలుదారులకు ప్రధాన సమస్య అయిన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి బడ్జెట్ అదనపు నిధులను కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
బడ్జెట్ 2026లో ప్రకటించిన విధాన నిర్ణయాలు దేశ EV రంగాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల సపోర్టు, కొత్త టెక్నాలజీని తీసుకురావడంతో పాటు ఉత్పత్తిని పెంచడానికి వీలు కల్పిస్తాయి. వాల్యూమ్స్ పెరిగేకొద్దీ, ఉత్పత్తి ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలకు ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఆర్థిక ప్రయోజనాలకు మించి, ఈ మార్పు కాలుష్యాన్ని తగ్గించడం, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించనున్నాయి.
Read Also: హ్యుండాయ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు.. దీనికి బ్రేకులు ఉండవు తెలుసా?