BYD First Plug in Hybrid for India: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD భారత మార్కెట్లో మరో కీలక అడుగు వేయబోతోంది. ఇప్పటి వరకు కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించిన ఈ సంస్థ, ఇప్పుడు తన తొలి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ (PHEV) మోడల్ ను జూన్ 9న భారతదేశంలో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన టీజర్ ద్వారా BYD ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. కొత్త మోడల్ లో కంపెనీ అభివృద్ధి చేసిన DM-i సూపర్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు కూడా స్పష్టం చేసింది. ఈ టెక్నాలజీతో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పనిచేస్తాయి. దీంతో ఎక్కువ రేంజ్తో పాటు మెరుగైన ఇంధన సామర్థ్యం కూడా లభిస్తుంది.
అయితే, జూన్ 9న ఏ మోడల్ ను విడుదల చేయబోతున్నారనే విషయాన్ని BYD ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో రెండు మోడళ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవి అట్టో 2 DM-I, సీలియన్ 6లో ఏదో ఒకటి విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
అట్టో 2 DM-i పరిమాణంలో హ్యుందాయ్ క్రెటాకు దగ్గరగా ఉంటుంది. ఈ SUVలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు బ్యాటరీ సపోర్ట్ ఉంటుంది. 7.8kWh, 18kWh బ్యాటరీ ఆప్షన్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ మోడల్ ఒకసారి పూర్తి ట్యాంక్, పూర్తి ఛార్జ్ తో గరిష్టంగా 998 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్ లో కూడా సుమారు 39 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.
మరోవైపు సీలియన్ 6 మరింత ప్రీమియం సెగ్మెంట్ లో ఉండే SUV. డిజైన్ పరంగా ఇది ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న సీలియన్ 7 EVని పోలి ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. 18.3kWh, 26.6kWh బ్యాటరీ ఎంపికలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సీలియన్ 6లో ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్లు కూడా ఉండొచ్చు. టాప్ వేరియంట్ 344 హార్స్ పవర్ వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV కేవలం ఎలక్ట్రిక్ మోడ్ లోనే 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. పూర్తి ట్యాంక్, పూర్తి ఛార్జ్ తో కలిపి గరిష్టంగా 1,092 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని BYD చెబుతోంది.
భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో BYD ఈ కొత్త విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం టయోటా, మారుతి సుజుకి లాంటి కంపెనీలు హైబ్రిడ్ టెక్నాలజీలో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు BYD కూడా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో పోటీలోకి దిగుతోంది. జూన్ 9న జరిగే ఆవిష్కరణ కార్యక్రమంలో ఏ మోడల్ ను తీసుకువస్తారో స్పష్టత రానుంది.
Read Also: జూన్ 5న విన్ ఫాస్ట్ ట్యాక్సీ సర్వీసులు షురూ.. ఉబెర్, ఓలాకు తలనొప్పి తప్పదా?