Honda India Upcoming Vehicles 2026-27: భారతీయ కారు మార్కెట్లో దుమ్మురేపేందుకు హోండా కార్స్ ఇండియా మాస్టర్ ప్లాన్ తో రెడీ అయ్యింది. 2026-27లో ఏకంగా 6 కొత్త మోడళ్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈమేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. వీటిలో హైబ్రిడ్ కార్లు, ఎలక్ట్రిక్ ఎస్యూవీలు, గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన కొన్ని ప్రీమియం మోడళ్లు కూడా ఉన్నాయి.
ఇప్పటికే హోండా సిటీ ఫేస్లిఫ్ట్, కొత్త ZR-V ఎస్యూవీని పరిచయం చేసింది. ఈ రెండు మోడళ్లతో ప్రారంభమైన కొత్త లాంల్ లు రాబోయే నెలల్లో మరింత ఊపందుకోనుంది. ఈ విషయాన్ని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ తకాషి నకాజిమా అధికారిక ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం హోండాకు చాలా కీలకం. కొత్త మోడల్స్ తో బ్రాండ్ ను మరింత బలంగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
హోండా ప్రస్తుతం హైబ్రిడ్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెడుతోంది. అదే సమయంలో కంపెనీ తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీని కూడా ఈ ఏడాదిలోనే తీసుకురానుంది. ‘0 ఆల్ఫా కాన్సెప్ట్’ ఆధారంగా తయారవుతున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీకి ఇప్పటికే భారత్ లోని పలు ప్రాంతాల్లో టెస్టింగ్ జరుగుతోంది. దీనిని భారతదేశంలో తయారు చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది.
ఇక ఎలివేట్ ఎస్యూవీ మార్కెట్లోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి కావడంతో, దీనికి కూడా మిడ్ లైఫ్ అప్డేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో హోండా కూడా తన మోడళ్లను అప్ డేట్ చేయడానికి సిద్ధమవుతోంది.
హోండా గ్లోబల్ మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన సివిక్, అకార్డ్, సీఆర్-వీ వంటి కార్లను కూడా భారత మార్కెట్లోకి తిరిగి తీసుకురావాలని భావిస్తోంది. వీటిని పూర్తిస్థాయి దిగుమతుల రూపంలో పరిమిత సంఖ్యలో విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోడళ్లకు విదేశీ మార్కెట్లో హైబ్రిడ్ పవ ర్ట్రెయిన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
అదే విధంగా ప్రిల్యూడ్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కార్ను కూడా హోండా భారత మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తీసుకురావాలని భావిస్తోంది. ప్రీమియం కార్ల మార్కెట్లో వినియోగదారుల స్పందనను అంచనా వేయడానికి ZR-Vను ఒక టెస్ట్ మోడల్గా ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
హోండా ప్రస్తుతం గ్రేటర్ నోయిడా, రాజస్థాన్ లోని తపుకారాలో తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. భవిష్యత్తులో సీకేడీ అసెంబ్లీ మోడళ్లను తిరిగి ప్రారంభించే అంశాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తోంది. ముఖ్యంగా సివిక్, అకార్డ్, సీఆర్ వీ లాంటి ప్రీమియం కార్లను గ్రేటర్ నోయిడా ప్లాంట్లో అసెంబుల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇవి కాకుండా, 2028 నాటికి భారత మార్కెట్ కోసం ఒక కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ, మరో మిడ్సైజ్ ఎస్యూవీని కూడా హోండా తీసుకురానుందని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.
Read Also: వేసవిలో కారు, బైక్ టైర్లు పగలకుండా ఉండాలంటే.. ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరి!