Hyundai Cars Price Hike: హ్యుందాయ్ కార్లు కొనాలనుకునే వారికి కంపెనీ మరోసారి షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 2026 నుంచి భారత మార్కెట్లో తన కార్ల ధరలను పెంచనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. కంపెనీ అమ్ముతున్న మొత్తం మోడల్ లైనప్పై ఈ ధరల పెంపు ప్రభావం ఉంటుందని వెల్లడించింది. ధరలు గరిష్టంగా 1 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అయితే, ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే పూర్తి వివరాలను హ్యుందాయ్ ఇంకా వెల్లడించలేదు. మోడల్, వేరియంట్ను బట్టి పెంపు మారుతుందని వివరించింది.
హ్యుందాయ్ తన ధరలను పెంచడానికి ప్రధాన కారణంగా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను ప్రస్తావించింది. ముడిసరుకు ధరలు పెరగడం, ఇతర వస్తువుల ఖర్చులు అధికం కావడం, నిర్వహణ వ్యయాలు పెరగడం కంపెనీపై ఒత్తిడి పెంచుతున్నాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు కూడా వ్యాపార వ్యయాలపై ప్రభావం చూపుతున్నాయని హ్యుందాయ్ తెలిపింది. ఇప్పటివరకు పెరిగిన ఖర్చుల్లో ఎక్కువ భాగాన్ని కంపెనీ తనవైపు నుంచి భరించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ ఒత్తిళ్లు కొనసాగుతుండటంతో కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది.
సెప్టెంబర్లో అమల్లోకి వచ్చే కొత్త ధరలు గరిష్టంగా 1 శాతం వరకు పెరగవచ్చు. ప్రస్తుతం అమ్ముతున్నమోడళ్ల ధరలను బట్టి చూస్తే, కొన్ని కార్లపై సుమారు రూ.7,767 నుంచి రూ.23,672 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. అయితే, ఇవి అంచనా మొత్తాలు మాత్రమే. హ్యుందాయ్ అధికారికంగా మోడల్ వారీగా కొత్త ధరలను ప్రకటించిన తర్వాతే కచ్చితమైన పెంపు ఎంత అనేది తెలుస్తుంది.
భారత్లో స్థానికంగా తయారవుతున్న హ్యుందాయ్ కార్లలో గ్రాండ్ i10 నియోస్ ధరలు ప్రస్తుతం రూ.5.59 లక్షల నుంచి రూ.8.04 లక్షల వరకు ఉన్నాయి. ఆరా ధర రూ.5.99 లక్షల నుంచి రూ.8.60 లక్షల వరకు ఉండగా, i20 ధర రూ.5.99 లక్షల నుంచి రూ.11.74 లక్షల వరకు ఉంది. ఎక్స్టర్ ధర రూ.5.80 లక్షల నుంచి రూ.9.46 లక్షల వరకు, వెన్యూ రూ.7.99 లక్షల నుంచి రూ.15.64 లక్షల వరకు ఉంది. క్రెటా ధర రూ.10.90 లక్షల నుంచి రూ.19.95 లక్షల వరకు ఉండగా, వెర్నా రూ.10.99 లక్షల నుంచి రూ.18.26 లక్షల వరకు ఉంది. అల్కాజర్ ధర రూ.14.50 లక్షల నుంచి రూ.21.25 లక్షల వరకు ఉంది. క్రెటా ఎలక్ట్రిక్ ధరలు రూ.18.02 లక్షల నుంచి రూ.23.67 లక్షల వరకు ఉన్నాయి.
హ్యుందాయ్ ఈ ఏడాది ధరలు పెంచడం ఇది మూడోసారి. ఇప్పటికే జనవరిలో ఒకసారి, జూన్లో మరోసారి ధరలను సవరించింది. ఇప్పుడు సెప్టెంబర్లో మరోసారి ధరలు పెంచేందుకు సిద్ధమైంది. తరచూ పెరుగుతున్న ఉత్పత్తి, నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో ఈ ధరల పెంపు తప్పనిసరి అయిందని కంపెనీ చెబుతోంది.
Read Also: సింగిల్ ఛార్జ్ తో 60 కిమీ రేంజ్.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహీంద్రా XEV 9S!