Petrol and Diesel Consumption: భారత్ లో పెట్రోల్ వినియోగం రాష్ట్రాల వారీగా చాలా భిన్నంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు భారీగా పెట్రోల్ ఉపయోగిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో వినియోగం చాలా తక్కువగా ఉంది. తాజాగా విడుదలైన పెట్రోలియం ప్లానింగ్, ఎనాలసిస్ సెల్ (PPAC) గణాంకాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి.
2024-25 సంవత్సరానికి సంబంధించిన వివరాల ప్రకారం, దేశంలో ప్రతి 100 మందికి రోజుకు సగటున 10.4 లీటర్ల పెట్రోల్ వినియోగం నమోదైంది. అయితే, ఈ సగటుతో పోలిస్తే కొన్ని ప్రాంతాల్లో వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఈ జాబితాలో గోవా అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ ప్రతి 100 మందికి రోజుకు 52.4 లీటర్ల పెట్రోల్ వినియోగం నమోదైంది. జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. పర్యాటక రంగం ఎక్కువగా ఉండటం, రెంటెల్ వాహనాల వినియోగం అధికంగా ఉండటం, అలాగే చిన్న రాష్ట్రం కావడం వల్ల గోవాలో ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇక పెట్రో వినియోగంలో రెండో స్థానంలో పాండిచ్చేరి ఉంది. అక్కడ ప్రతి 100 మందికి రోజుకు 41 లీటర్ల పెట్రోల్ వినియోగిస్తున్నారు. చండీగఢ్ 37.8 లీటర్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ ప్రాంతాల్లో కూడా వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటం, పర్యాటక రద్దీ ఉండటం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
ఇక తక్కువ పెట్రోల్ వినియోగం ఉన్న రాష్ట్రాల్లో బీహార్ అట్టడుగున ఉంది. అక్కడ ప్రతి 100 మందికి రోజుకు కేవలం 3.3 లీటర్ల పెట్రోల్ మాత్రమే వినియోగంలో ఉంది. తర్వాత వెస్ట్ బెంగాల్ 5.1 లీటర్లతో రెండో స్థానంలో ఉంది. తక్కువ వాహన యాజమాన్యం, ప్రజా రవాణాపై ఆధారపడటం లాంటి కారణాలతో తక్కువ పెట్రోల్ వినియోగం ఉంది.
డీజిల్ వినియోగం విషయంలో కూడా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశ సగటు ప్రతి 100 మందికి రోజుకు 21 లీటర్లుగా ఉంది. అయితే అండమాన్ నికోబార్ లో డీజిల్ వినియోగం అత్యధికంగా 144 లీటర్లుగా ఉంది. ఆ తర్వాత లద్దాఖ్ లో లీటర్లతో ఉంది. పర్వత ప్రాంతాలు, ప్రత్యేక రవాణా అవసరాలు కారణంగా అక్కడ డీజిల్ వినియోగం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఇక డీజిల్ వినియోగంలో కూడా బీహార్ తక్కువ స్థాయిలో ఉంది. అక్కడ ప్రతి 100 మందికి రోజుకు కేవలం ఆరు లీటర్లు మాత్రమే నమోదయ్యాయి. ఢిల్లీలో ఈ సంఖ్య ఎనిమిది లీటర్లుగా ఉంది.
ఇక ఇంధన ధరల విషయానికొస్తే, పశ్చిమ ఆసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాపై ప్రభావం పడితే భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలకు అదనపు భారంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు.
Read Also: ఆటోమేటిక్ గేర్ బాక్స్ సేఫ్ గా ఉండాలంటే, ఈ తప్పులు అస్సలు చేయకండి!