New Petrol Two Wheelers Banned: పెట్రోల్ బైక్లకు గుడ్బై చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయా? త్వరలో ఢిల్లీలో అమల్లోకి రానున్నకొత్త ఈవీ పాలసీని చూస్తే నిజమే అనిపిస్తోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది.
2028 ఏప్రిల్ 1 నుంచి కొత్త పెట్రోల్ బైక్స్ రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభిస్తే, ఢిల్లీలో కొత్త పెట్రోల్ బైక్లు, స్కూటర్లను కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉండదు. కొత్తగా కొనుగోలు చేసే వారికి కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకే అనుమతి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్రజలు ఉపయోగిస్తున్న పెట్రోల్ బైక్లపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలు మామూలుగానే తిరుగుతాయి. కొత్తగా రిజిస్టర్ అయ్యే పెట్రోల్ బైక్లకే ఈ నిబంధన వర్తించనుంది.
ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఈ విధానం వెనుక ప్రధాన లక్ష్యం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడం. దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీ చాలా కాలంగా గాలి కాలుష్య సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త విధానంలో భాగంగా ప్రజలను ఈవీల వైపు ఆకర్షించేందుకు పలు ప్రోత్సాహకాలను కూడా అందించే అవకాశం ఉంది. ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, వాహన కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లాంటివి చేయనుంది.
టూ వీలర్స్ మాత్రమే కాకుండా ఇతర వాహనాల విషయంలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. ముఖ్యంగా కొన్ని త్రీ వీలర్స్ కు 2027 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్లు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం చేసే అవకాశం ఉంది. అంటే రాబోయే కొన్నేళ్లలో క్రమంగా సంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆటోమొబైల్ రంగంలో ఇదో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. పెట్రోల్ బైక్లు పూర్తిగా కనుమరుగవుతాయా? అనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేకపోయినా, కొత్త వాహనాల మార్కెట్ మాత్రం వేగంగా ఈవీల వైపు మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రతిపాదనకు ఇంకా అధికారిక ఆమోదం రావాల్సి ఉంది. ఆమోదం లభిస్తే 2028 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్ బైక్లకు ముగింపు పలికే అవకాశం ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలను అమలు చేసే దిశగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: అల్ట్రావయోలెట్ To రివోల్ట్.. జూలైలో లాంచ్ కానున్న టాప్ ఎలక్ట్రిక్ బైక్లు ఇవే!