TVS Surpasses Ola in EV Sales: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్ లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు వెనుకబడిపోయింది. అటు టీవీఎస్ మోటార్ కంపెనీ వేగంగా దూసుకొచ్చింది. మొత్తం ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాల్లో ఓలాను అధిగమించింది. దేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మిన కంపెనీగా టీవీఎస్ గుర్తింపు పొందింది.
వాహన్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం.. టీవీఎస్ ఇప్పటివరకు 11,27,873 ఎలక్ట్రిక్ టూ వీలర్లను రిజిస్టర్ చేసింది. అదే సమయంలో ఓలా ఎలక్ట్రిక్ 11,17,031 యూనిట్లతో ఉంది. అంటే టీవీఎస్ ప్రస్తుతం ఓలాపై 10,842 యూనిట్ల ఆధిక్యంలో ఉంది. అయితే ఈ ఆధిక్యం ఒక్కసారిగా రాలేదు. కొద్ది రోజుల క్రితం వరకు ఓలానే ముందంజలో ఉంది. జూలై చివరి నాటికి ఓలా 11,08,565 యూనిట్లతో టీవీఎస్ కంటే 15,996 యూనిట్లు ముందుంది. కానీ, ఆగస్టు మొదటి 24 రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఆగస్టు 1 నుంచి 24 వరకు టీవీఎస్ ఏకంగా 35,304 ఎలక్ట్రిక్ టూ-వీలర్లను రిజిస్టర్ చేసింది. అదే సమయంలో ఓలా కేవలం 8,466 యూనిట్లకే పరిమితమైంది. దీంతో ఓలాతో ఉన్న వ్యత్యాసాన్ని టీవీఎస్ వేగంగా తగ్గించడమే కాకుండా.. చివరకు ఓలాను అధిగమించింది. టీవీఎస్ అమ్మకాలు పెరగడానికి ఐక్యూబ్, ఆర్బిటార్ లాంటి మోడళ్లు ప్రధాన కారణం అయ్యాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో స్థిరంగా ముందుకు కొనసాగుతోంది.
2026లో ఇప్పటివరకు టీవీఎస్ 3,42,958 ఎలక్ట్రిక్ టూ-వీలర్లను రిజిస్టర్ చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 75 శాతం ఎక్కువ. అంతేకాదు.. 2025లో ఏడాది మొత్తంలో టీవీఎస్ విక్రయించిన 3,15,081 యూనిట్లను కూడా ఈ ఏడాది ఇప్పటికే అధిగమించింది. జూన్ 2026లో కంపెనీకి మరింత సత్తా చాటింది. ఆ నెలలో 55,783 ఎలక్ట్రిక్ టూ వీలర్లను విక్రయించి తన సరికొత్త నెలవారీ రికార్డును నమోదు చేసింది.
రెండేళ్ల క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. 2024లో ఓలా ఎలక్ట్రిక్ 4,29,187 యూనిట్లను విక్రయించి, దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో సుమారు 35 శాతం వాటాను సాధించింది. ఆ ఏడాది 4 లక్షల వార్షిక అమ్మకాలను దాటిన తొలి భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీగా కూడా నిలిచింది. కానీ, 2025లో ఓలా అమ్మకాలు భారీగా తగ్గాయి. మొత్తం విక్రయాలు 2,04,542 యూనిట్లకు పడిపోవడంతో మార్కెట్ వాటా కూడా దాదాపు 15 శాతానికి చేరింది. 2026లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జనవరి 1 నుంచి ఆగస్టు 24 వరకు ఓలా 88,910 యూనిట్లను మాత్రమే రిజిస్టర్ చేసింది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు మార్కెట్ వాటా సుమారు 7 శాతానికి పడిపోయింది. రాబోయే నెలల్లో టీవీఎస్, ఓలాతో పాటు బజాజ్, ఏథర్ లాంటి కంపెనీల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
Read Also: పండుగ సీజన్ కు ముందే బజాజ్ బిగ్ ప్లాన్.. ఏకంగా 6 కొత్త బైక్లు రెడీ!